సెమీ ఫైనల్: నిర్మలా సీతారామన్ ఏం చేయబోతోన్నారు..!!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష యూపీఏకు ఇది అత్యంత కీలకమైన సంవత్సరం. ఈ ఏడాదే ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు- ఇవి సెమీ ఫైనల్ గా భావిస్తోన్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఎన్డీఏ, యూపీఏ సన్నద్ధమౌతోన్నాయి. ఈ నెల నుంచే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాయి.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలివే..
కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తొలి అయిదింటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
ఈ పరిణామాల మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. దీనికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31వ తేదీన ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్- ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. అనధికారికంగా వెలువడిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఇది. దాదాపుగా ఇవే తేదీలు ఖరారు కావొచ్చని తెలుస్తోంది.
నిర్మలమ్మ ఏం చేస్తారు..
ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సంవత్సరం సార్వత్రిక పోరు ఉన్న నేపథ్యంలో- నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారనేది ఉత్కంఠత రేపుతోంది. ఎలాంటి రాయితీలు ఉంటాయి?, వేతన జీవుల ఎదురు చూపులు ఫలిస్తాయా?, ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉండొచ్చు?, పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం చేయడానికి నిర్మల సీతారామన్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారనేది చర్చనీయాంశమౌతోంది.
రూ.5 లక్షల వరకు..
వేతన జీవుల కోసం కీలక రాయితీలు, మినహాయింపులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆదాయంపై గల పన్ను రాయితీ స్లాబ్ను నిర్మల సీతారామన్ పెంచుతారని చెబుతున్నారు. రెండున్నర లక్షల రూపాయల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయల లోపు ఉన్న వారిని పన్నుల నుంచి మినహాయింపు ఖాయమని అంటున్నారు.
ప్రతిపక్షాలు సిద్ధం..
ఎన్నికల ఏడాదిలో ప్రవేశించినందువల్ల అటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమరానికి సన్నద్ధమౌతోన్నాి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోన్నాయి. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, జీఎస్టీ, పెట్రోల్-డీజిల్ రేట్లు.. ఇవన్నీ ఉభయసభల్లో ప్రస్తావనకు తీసుకుని రానున్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును ప్రదర్శిస్తోండటం, నానాటికీ పడిపోతూ వస్తోన్న రూపాయి విలువ, ఇతర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది.