ఒకే ఫ్యామిలీలో 11మంది అనుమానాస్పద మృతి: హత్యలేనా?, డైరీలో ఏముంది? ‘ఆ11 పైపులేంటీ?’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒకే కుటుంబానికి చెందిన 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనై వారు మోక్షం కోసం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నప్పటికీ.. వారి మరణాలపై అనుమానాలున్నాయి.
వాళ్లకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని వారి బంధవులంటున్నారు. అంతేగాక, తమ వాళ్లంతా చదువుకున్న వాళ్లని, వాళ్లు మూఢ నమ్మకాలను నమ్మరని చెబుతున్నారు. ఎవరో దుండగులు వారిని చంపి, వేలాడదీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి హత్యలే..
తమ కుటుంబసభ్యుల మృతిపై చనిపోయిన వృద్ధురాలి మనవడు కేతన్ నాగ్పాల్ స్పందించారు. తమ కుటుంబానికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవని.. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇవి హత్యలు అయ్యి ఉంటాయని అనుమానం వ్యక్తంచేశారు. మృతులంతా చదువుకున్న వాళ్లని, మూఢ విశ్వాసాలపై నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోర్లను, చేతులను కట్టేసుకునే వారు కాదు కదా? అని ప్రశ్నించారు.

ఎవరో చంపివుంటారు..
శనివారం రాత్రి తమ కుటుంబసభ్యులు వారితో మాట్లాడారని, ఆ సమయంలో వాళ్లు చాలా సాధారణంగా మాట్లాడారని, మాటల్లో ఎలాంటి ఒత్తిడి కనిపించలేదని మరో బంధువు వెల్లడించారు. వారికి ఎవరితో శత్రుత్వం కూడా లేదని, కానీ ఎవరో చంపేసి ఉంటారని మేము అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ మరణాల పట్ల ఎలాంటి మతపరమైన కారణం లేదని అన్నారు. వారికి దేవుడి పట్ల నమ్మకం ఉంది కానీ.. మూఢనమ్మకాలు నమ్మేవారు కాదని, అంతా చదువుకున్న వాళ్లని మరో బంధువు చెప్పారు.

మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా?
కాగా, న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ ఇంట్లో ఈ 11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడం కలకలం రేపింది. అయితే వారి ఇంట్లో లభ్యమైన డైరీ, పలు పత్రాల ప్రకారం.. మతపరమైన కారణాలు, మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా? అని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒకేసారి ఒకే విధంగా చనిపోతే వారంతా దేవుని దగ్గరికి వెళ్తారని డైరీలో రాసి ఉందని పోలీసులు తెలిపారు.

ఓ యువతికి ఏడాది చివర్లో పెళ్లి పెట్టుకున్నారు..
మృతుల కళ్లకు గంతలు.. చేతులు, నోరు కట్టేసి ఉన్నాయి. వీరి మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించగా.. నారాయణ్ దేవి అనే 77ఏళ్ల వృద్ధురాలి మృతదేహం మాత్రం నేలపై ఉంది. నారాయణ్ దేవి కుమార్తె ప్రతిభ(57), కుమారులు భవ్నేశ్(50), లలిత్ భాటియా(45), భవ్నేశ్ భార్య సవిత(48), వారి ముగ్గురు పిల్లలు మీను(23), నిధి(25), ధ్రువ్(15), లలిత్ భాటియా భార్య టీనా(42), వారి కుమారుడు శివమ్(15), ప్రతిభ కుమార్తె ప్రియాంక (33)ల మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాయి. ప్రియాంకకు రెండు వారాల క్రితమే నిశ్చితార్థం కాగా, ఈ ఏడాది చివర్లో వివాహం జరగాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు.

ఆసక్తిరేపుతున్న 11 గొట్టాలు
కాగా, మోక్షం కేసమే ఆత్మహత్య చేసుకున్నారన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొంత కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ ఇంట్లో దొరికిన ఓ లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ లేఖ డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే మరో కొత్తకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటికి గోడకు ఉన్న 11 గొట్టాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద 11 పైపులు, అసాధారణ పద్ధతిలో అమర్చి ఉండటంతోపాటు ఆ పైపులు అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన వైనం ఒకేలా ఉండటం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఈ పైపులకు, భాటియా కుటుంబం మరణాలకు కచ్చితంగా సంబంధముందని భాటియా స్నేహితుడు నితిన్ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పోలీసులను కోరారు.

లేఖలో సంచలన విషయాలు
పోలీసులకు లభించిన లేఖలో.. ‘మరణానికి గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలి. కండ్లను బట్టతో కట్టుకోవాలి. ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి. చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా నిష్టంగా పూజలునిర్వహించాఇ. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి. పెద్దవాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి. డిమ్ లైట్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి.
చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి. నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి.
ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి.
రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకుముందే చేయాలి. అందరిలోనూ ఒకేరకమైన పవిత్ర భావన ఉండాలి. అపుడు మాత్రమే మోక్షానికి మార్గం సుగమవుతుంది' అని రాసి ఉండటం గమనార్హం.

పూజల్లో పాల్గొన్నారా?
అయితే, మోక్షం మంత్ర, తంత్ర పూజల్లో ఆ కుటుంబీకులు పాల్గొన్నారా లేదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లేఖను మరింతగా విశ్లేషిస్తున్నామని పోలీస్ కమీషనర్ అలోక్ కుమార్ తెలిపారు. ఇతర అనేక అంశాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నామనీ, లేఖను డీకోడ్ చేసిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఆరుగురు ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక తేల్చింది. లభిస్తున్న ఆధారాలతో ఈ మరణాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications