షిర్డీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది భక్తులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
షిర్డీ: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది భక్తులు మరణించారు. ఈ ఘటన నాసిక్ జిల్లా పథారే సిన్నార్ సమీపంలో నాసిక్-షిర్డీ హైవేపై చోటు చేసుకుంది.
బస్సులో అంబర్నాథ్ థానే ప్రాంతానికి చెందిన 50 మంది సాయి భక్తులు.. షిర్డీకి బయల్దేరారు. పథారే ప్రాంతంలో బస్సు-లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారి వైద్య ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు సీఎంవో ప్రకటించింది. మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.