కైరానా బైపోల్ ఎందుకంత కీలకం?: అదే ఐక్యత బీజేపీని మళ్లీ దెబ్బకొడుతుందా? లేక..
Recommended Video
లక్నో: మొన్నటి గోరఖ్ పూర్, ఫల్పూర్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ పతనం ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందనడానికి సంకేతాలా?.. లేక బీజేపీ ఓటమి ఆ రెండు స్థానాలకే పరిమితమా?.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి 'కైరానా' లోక్ సభ ఉపఎన్నికల ఫలితాలను పరిశీలించాల్సి ఉంటుంది. గోరఖ్ పూర్, ఫల్పూర్ నియోజకవర్గాల్లో లాగే ఇక్కడ కూడా విపక్షాలన్ని బీజేపీకి ఏకమయ్యాయి. కైరానాలో బీజేపీ ప్రత్యర్థి అయిన రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యత బీజేపీని మట్టికరిపిస్తుందా.. లేక కమలదళం తన సత్తా చాటుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
విపక్షాల ఐక్యత దెబ్బకొడుతుందా?:
2014లో బీజేపీ కైరానా లోక్ సభ స్థానాన్ని గెలుచుకోగా.. ఎంపీ కుకుమ్ సింగ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఆయన కుమార్తె మృగాంక సింగ్ బీజేపీ తరుపున ఉపఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీపై పోటీ చేస్తున్న కైరానా ఆర్.ఎల్.డి అభ్యర్థి తబసుమ్ హసన్ కి ఎస్పీ, బీఎస్పీలు మద్దతు పలికాయి. విపక్షాల ఐక్యతతో సామాజిక వర్గాల సమీకరణాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉండటంతో బీజేపీని దెబ్బకొట్టే అవకాశాలు లేకపోలేదు.
సామాజికవర్గాల సమీకరణాలు:
కైరానా నియోజకవర్గంలో ముస్లిం సామాజికవర్గ ఓట్లే కీలకం. నియోజకవర్గంలోని మొత్తం 16లక్షల ఓటర్లలో దాదాపు 6లక్షల మంది ముస్లింలే ఉన్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఆర్.ఎల్.డికి మద్దతునివ్వడంతో ఆ సామాజికవర్గంతో పాటు బీసీలు, దళితుల ఓట్లన్ని ఆర్.ఎల్.డికే పడుతాయన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం మిగతా సామాజికవర్గాలను సమీకరించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా గుజ్జర్, జాట్, సైని, కశ్యప్, దళితుల ఓట్లను టార్గెట్ చేసింది. మొత్తంగా హిందూ ఓటు బ్యాంకు మొత్తం తన ఖాతాలోనే పడుతుందన్న ధీమాతో ఉన్నది.
కైరానా ఫలితం ఏం చెబుతుంది?:
ఈ ఏడాది ఆరంభంలో రాజస్థాన్లోని అజ్మేర్, అల్వర్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు స్థానాలను ఆధారంగా చేసుకుని బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనడం సరికాదన్న వినిపించింది. ఇంతలో ఉత్తరప్రదేశ్ లోనూ అదే రిపీటయింది. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ఖాళీ చేసిన స్థానాల్లోనే బీజేపీకి పరాభవం తప్పలేదు. దీంతో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందా? అన్న చర్చ మరింతగా తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో 'కైరానా' ఉపఎన్నిక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ బీజేపీ గెలిస్తే.. మా గ్రాఫ్ పడిపోలేదని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఫలితం ప్రతికూలంగా వస్తే మాత్రం.. ఎస్పీ, బీఎస్పీల ఐక్యతకు మరింత బలం చేకూరుతుంది. ఆ ప్రభావం 2019 ఎన్నికల మీద పనిచేయవచ్చు.
ఈవీఎంలపై ఆరోపణలు:
మొత్తం 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు మూడు రోజుల క్రితం ఎన్నికలు జరగ్గా.. చాలాచోట్ల ఈవీఎంలు, వివిపాట్ మెషీన్లు సరిగా పనిచేయలేదు. దీంతో కొన్ని స్థానాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించక తప్పలేదు. ఇక కైరానా విషయానికొస్తే.. ఇక్కడ ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లోపాలు ఉన్న ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించారని ఆర్.ఎల్.డి అభ్యర్థి తబసుమ్ ఆరోపించారు. జిల్లా మెజిస్ట్రేట్ మాత్రం ఆరోపణలను ఖండించారు. ఏదేమైనా నేడు వెలువడే కైరానా ఓటరు తీర్పు బీజేపీ రాజకీయాలపై మాత్రం కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు.