హిజాబ్ తీర్పిచ్చిన న్యాయమూర్తులకు బెదిరింపులు; ముగ్గురు తమిళనాడు తౌహీద్ జమాత్ కార్యకర్తలపై కేసునమోదు
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసనల పర్వం కొనసాగుతోంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు కాకుండా యూనిఫామ్ ధరించాలని, ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి ఏమీ కాదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముస్లిం సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగవలసి ఉంది. హోలీ తరువాత దీనిని విచారిస్తాం అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.

హిజాబ్ పై కోర్టు తీర్పు.. ముగ్గురు తమిళనాడు తౌహీద్ జమాత్ కార్యకర్తలపై కేసు
ఇదిలా ఉంటే హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తమిళనాడు తౌహీద్ జమాత్ కార్యకర్తలపై కేసు నమోదైంది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై మధురైలోని కొరిపాళయం ప్రాంతంలో జమాత్ ఇటీవల బహిరంగ సభ నిర్వహించింది. కార్యనిర్వాహకులలో ఒకరి ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జార్కండ్ హైకోర్టు న్యాయమూర్తి మరణ ఉదంతాన్ని ఉటంకిస్తూ, హిజాబ్ తీర్పుపై న్యాయమూర్తులు ఇప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

హిజాబ్ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై తమిళనాడు తౌహీద్ జమాత్ షాకింగ్ వ్యాఖ్యలు
హిజాబ్ కేసు తీర్పుపై న్యాయనిపుణులు హత్యకు గురైతే, వారి మరణానికి వారే బాధ్యత వహిస్తారని తమిళనాడు తౌహీద్ జమాత్ నాయకుడు కోవై ఆర్ రహమతుల్లా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ తనను తాను బీజేపీకి అమ్ముకుందని, కోర్టు నిర్ణయం చెల్లదని, చట్టవిరుద్ధమని రహమతుల్లా వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా సూచనల మేరకే కర్ణాటక హైకోర్టు ఈ తరహా తీర్పు వెలువరించింది అని రహమతుల్లా పేర్కొన్నారు. ఇదే సమయంలో న్యాయమూర్తులు తమ పక్షపాత తీర్పుకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తులను బెదిరించారని ఆరోపిస్తూ తౌహీద్ జమాత్ కార్యకర్తలపై ఫిర్యాదు
న్యాయమూర్తులు వ్యక్తిగత విశ్వాసాలపై కాకుండా రాజ్యాంగం ఆధారంగా కోర్టు తీర్పు ఇవ్వాలని రహమతుల్లా పేర్కొన్నారు. ఈ సమావేశంలోనే అక్కడికి వచ్చిన చిన్న పిల్లల చేత కూడా హింసను ప్రేరేపించే నినాదాలు చేయించారు. దీంతో కార్యక్రమం ముగిసిన తర్వాత, కర్ణాటక హెచ్సి ఉత్తర్వులపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని, న్యాయమూర్తులను బెదిరించారని ఆరోపిస్తూ కార్యకర్తలపై ఫిర్యాదు నమోదైంది.

ఐపీసీలోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు
బీజేపీ సీనియర్ నేత వనతీ శ్రీనివాసన్ ఈ వీడియో కంటెంట్పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును అనుసరించి, మధురై పోలీసులు ముగ్గురు తమిళనాడు తౌహీద్ జమాత్ కార్యకర్తలపై 153(a),505(1)(c),505(2),506(1) r/w 109 IPC సహా ఐపీసీలోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications