చావడం మేలు: శశికళపై కట్జూ తీవ్రవ్యాఖ్యలు, జయలలితపై డీఎంకే
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన జస్టిస్ కట్జూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైలు పక్షి శశికళ చేతిలో కీలుబొమ్మ ముఖ్యమంత్రి పళనిస్వామిని అంగీకరించలేమన్నారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన జస్టిస్ కట్జూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైలు పక్షి శశికళ చేతిలో కీలుబొమ్మ ముఖ్యమంత్రి పళనిస్వామిని అంగీకరించలేమని, దాని కంటే చావడం మేలన్నారు.
ఓ జైలు పక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడు ముఖ్యమంత్రిని చేశారని, పౌరుషం గల తమిళ ప్రజలుగా మీరు దీనిని అంగీకరించడం, అచేతనులుగా ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
హర్షించరన్న కట్జూ
కుట్రకు దాసోహం కావడాన్ని మీ పితృదేవతలు హర్షించరని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి (పళనిస్వామి) శిరస్సు వంచడం మీకు అవమానం కాదా అని ప్రశ్నించారు. గతంలో తాను ఒక తమిళిడిని అంటూ గర్వంగా చెప్పుకొన్నానని, పళనిస్వామి సీఎంగా ఉన్నంతకాలం తమిళ అభిమానిగా ఉండలేనని, దీని కన్నా చావడం మేలమన్నారు.
డిఎంకే డిమాండా్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా తేల్చిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాలని డీఎంకే డిమాండ్ చేసింది.
పేర్లు పెట్టవద్దు
ప్రభుత్వ పథకాలకు జయలలిత పేర్లు పెట్టడాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టు డీఎంకే అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ శనివారం అన్నారు. అక్రమ ఆస్తుల కేసులో జయను సుప్రీంకోర్టు దోషిగా నిర్దారించిందని, ఇప్పటికే ఆమె పేరుతో రాష్ట్రంలో కొన్ని పథకాలున్నాయని, కొత్త పథకాలకు ఆమె పేర్లు ప్రభుత్వం పెట్టకూడదన్నారు.
అక్కడి నుంచి జయ ఫోటోలు తొలగించండి
ప్రస్తుతం ఆమె పేరుతో అమలులో ఉన్న పథకాల పేర్లు కూడా మార్చాలని తాము కోరుతున్నామని స్టాలిన్ అన్నారు. సెక్రటేరియట్, మంత్రులకు కేటాయించిన గదులు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో జయలలిత ఫోటోలను తొలగించాలన్నారు. పరిస్థితిలో మార్పు రాకుంటే కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు.
సీఎస్కు చెప్పాం
ఇప్పటికే తాము ఈ విషయాలను చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ దృష్టికి తీసుకువెళ్లామని, తప్పనిసరిగా పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారని స్టాలిన్ చెప్పారు. జయలలిత 69వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.