నా కూతురు ఆలస్యంగా ఇంటికొస్తే నిద్రపోను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తన కుమార్తె హర్షిత ఇంటికి వచ్చే వరకు తనకు నిద్ర పట్టదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యమంత్రిని అయినప్పటికీ తన కుమార్తె ఆలస్యంగా ఇంటికి వస్తే ఆందోళన చెందుతానని ఆయన అభిప్రాయపడ్డారు.
తన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ఐఐటీ క్యాంపస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తే తనకు ఆందోళనగా ఉంటుందని కేజ్రీవాల్ చెప్పారు. తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంక ఎలాగుంటుందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.
పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము రక్షణ ఉన్న సమాజంలోనే ఉన్నామని మహిళలు, కుటుంబాలు అనుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళల రక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి అన్నారు.

మహిళా హక్కుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెడతామన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్కు మరిన్ని అధికారాలు ఇస్తామని చెప్పారు.
తన కూతురు ఐఐటి ఢిల్లీలో చదువుతోందని, కొన్ని సందర్భాల్లో ఆమె రాత్రి పదకొండు గంటలకు మెట్రోలో వస్తుందని, ఆమె ఇంటికి వచ్చే వరకు తాము ఆందోళన చెందుతామని కేజ్రీవాల్ చెప్పారు. ఆమె ఇంటికి వచ్చే వరకు తమ ఇంట్లో ఎవరూ నిద్రపోరన్నారు.
తన కూతురు దిగే మెట్రో స్టేషన్ ఇంటికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకు వచ్చేందుకు ఓ కారును పంపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications