కాలం తిరిగిరాదు! జమ్మూకాశ్మీర్ విభజనను అడ్డుకోలేం: తేల్చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ను విభజించి రెండు కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా!
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. తొమ్మిది పిటిషన్ల తోపాటు కాశ్మీర్ పరిస్థితులపై దాఖలైన పిటిషన్లను విచారించారు. అయితే, ఈ వ్యాజ్యాలపై వివరణ ఇచ్చేందుకు కేంద్రానికి కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31న జమ్మూకాశ్మీర్ రాష్ట్రం, లడక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుకానున్నాయి. అయితే, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమేనా.. కాదా? అన్న దానిపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ నిలిపివేతకు ఆదేశాలు జారీ చేయాలని రాజు రామచంద్రన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. ఇందుకు నిరాకరించింది. 370 రద్దు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు కేంద్రానికి గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జమ్మూకాశ్మీర విభజన నిర్ణయంపై స్పందిస్తూ.. జరిగిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేమని వ్యాఖ్యానించింది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జర్నలిస్టులు, మీడియా, ప్రజలపైనా తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది. మొబైల్ సేవలు కూడా అందుబాటులోనే ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. మనం జాతీయ భద్రతతోపాటు ప్రజల స్వేచ్ఛను కూడా సమానంగా చూడాలని కోర్టు అభిప్రాయపడింది.
కాగా, ఆగస్టు నెలలో జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతోకూడిన కేంద్ర ప్రాలిత ప్రాంతంగా, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది.