బుల్లెట్, లాఠీల కోసం పుట్టలేదు.. మోడీ సర్కార్ను దించేద్దాం.. అరుంధతీ రాయ్ వ్యాఖ్యలు, కేసు
ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్పై దేశ రాజధాని ఢిల్లీలో కేసు నమోదైంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో వివాదాస్పద ప్రసంగం చేశారని రాజీవ్ కుమార్ రంజన్ అనే అడ్వకేట్ ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అరుంధతి రాయ్పై ఐపీసీ సెక్షన్ 295ఏ, 504, 153, 128బీ కింద కేసు నమోదు చేశారు. ఆమె చేసిన ప్రసంగం ఏమిటంటే..
ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వండి..
దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు అరుంధతీ రాయ్ మద్దతు పలికారు. డిసెంబర్ 25వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్పీఆర్, జనాభా లెక్కల సమయంలో అబద్ధం ఆడాలని, సరైన వివరాలు చెప్పవొద్దు. తప్పుడు పేర్లను, అడ్రస్ను చెప్పాలి అని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వాన్ని మరో నాలుగేళ్లు
ఎన్ఆర్సీ మాదిరిగానే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్పీఆర్) డేటాబేస్ ఉంటుంది. మోడీ ప్రభుత్వాన్ని మరో నాలుగేళ్లు కొనసాగించవద్దు అని అరుంధతీ రాయ్ వెల్లడించారు. ఎన్పీఆర్ పేరుతో కొందరు మీ ఇంటికి వస్తారు. దాని సాకుతో ఎన్సీఆర్ కోసం వివరాలు సేకరిస్తారు. మీ ఫోన్ నెంబర్లు, పేర్లను తీసుకొని వెళ్తారు. ఇదంతా ఎన్ఆర్సీ డేటాబేస్ కోసమే అని అరుంధతీ రాయ్ పేర్కొన్నారు.
సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో నాలుగు ఏళ్లు పోరాటం చేద్దాం. నాలుగేళ్లు సమయం ఇవ్వకుండా ముందే గద్దె దింపుదాం. దాని కోసం మనం పక్కా ప్లాన్ చేద్దాం. ఎన్పీఆర్ పేరుతో వచ్చే వాళ్లకు బిల్లా రంగా, కుంగ్ ఫు కుట్టా అని పేర్లు చెప్పండి.. అడ్రస్ అడిగితే 7 రేస్ కోర్స్ రోడ్డు అని, ఏదో ఒక ఫోన్ నంబర్ చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇవ్వండి అంటూ అరుంధతీ రాయ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తూటాలకు, బుల్లెట్లకు వ్యతిరేకంగా
ప్రభుత్వం కొనసాగించే విధానాలు వ్యతిరేకిద్దాం. కానీ మనం సర్కారు తూటాలకు బలికావడానికో, లాఠీ దెబ్బలు తినడానికో పుట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నది అని అరుంధతీ రాయ్ ఆవేశంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై అడ్వకేట్ రాజీవ్ కుమార్ రంజన్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.