కావేరీ వివాదంపై తమిళనాట బంద్, ఏపీ బస్సులు ధ్వంసం: కేంద్రానికి దేవేగౌడ హెచ్చరిక
చెన్నై: కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఇచ్చిన బంద్లో గురువారం పలు పార్టీలు పాల్గొన్నాయి. డీఎంకే నేతృత్వంలో అఖిలపక్ష రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
బంద్ నేపథ్యంలో తమిళనాడులోని పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఏపీ బస్సులను ధ్వంసం చేశారు. బయటకు వచ్చిన తమిళనాడు బస్సులను కూడా ధ్వంసం చేశారు. పలుచోట్ల రాళ్ల దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు.. పలు రైళ్లు రద్దయ్యాయి. అన్నశాలైలో బందులో పాల్గొన్న డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంకే స్టాలిన్ రోడ్డుపై ధర్నాకు కూర్చున్నారు. ఆ తర్వాత అతను మెరీనా బీచ్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల ఆందోళనకారులు ధర్నాకు దిగారు.
#WATCH: DMK Working President MK Stalin carried away by Police & detained during protest in Chennai over #CauveryWaterManagementBoard issue. pic.twitter.com/nOcsogSdWX
— ANI (@ANI) April 5, 2018
అన్నాడీఎంకేపై కమల్ హాసన్ ఆగ్రహం
మక్కల్ నీధి మైయ్యమ్ అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ అధికార అన్నాడీఎంకే పార్టీపై నిప్పులు చెరిగారు. అన్నాడీఎంకే ఢిల్లీ ప్రభువులకు బానిసలా మారిందని మండిపడ్డారు. ఆయన బుధవారం తిరుచ్చిలో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఎదుట పిటిషన్ దాఖలు చేయడం వంటి వాటి ద్వారా తాము ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయాలని, కేంద్రం కావేరీ యాజమాన్య బోర్డును ఆరు వాల్ల్లో వేస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
దేవేగౌడ రాజీనామా హెచ్చరిక
కావేరి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న డిమాండును కేంద్రం పరిగణలోనికి తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ ప్రధాని దేవేగౌడ హెచ్చరించారు. తమిళనాడు బెదిరింపులకు కేంద్రం తలొగ్గరాదన్నారు. నూతన వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై కేంద్రం వాస్తవికంగా ఆలోచించాలన్నారు.
తమిళనాడు ప్రభుత్వం మరింత సంయమనాన్ని పాటించాలన్నారు. లేదంటే ఈ విషయంలో పోరాటం కోసం తనతోపాటు జనతాదళ్(ఎస్) లోకసభ సభ్యులు కూడా రాజీనామాకు సిద్ధమన్నారు.
కావేరి ధర్మాసనం ద్వారా కర్ణాటకకు అన్యాయం జరిగిన నేపథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ ద్వారా ప్రస్తుతం 14 టీఎంసీల అదనపు నీరు రాష్ట్రానికి దక్కిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, పూర్తి స్థాయిలో న్యాయం మాత్రం దక్కలేదన్నారు. ఈ కేసును వాదిస్తున్న కర్ణాటక న్యాయవాది ఎస్ నారిమన్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మరొక సమర్థ న్యాయవాదిని ప్రభుత్వం నియమించాలన్నారు.