బీజేపీలో చేరండి.. సీబీఐ-ఈడీ దాడుల నుంచి తప్పించుకోండి..!!
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ వరుస షాక్లను ఇస్తోంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు లుక్ అవుట్ సర్కులర్ను ఇదివరకే జారీ చేసింది. ఆయన నివాసంలో సోదాలను నిర్వహించిన రెండో రోజే సీబీఐ అధికారులు ఈ సర్కులర్ను జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ప్రమేయం ఉన్న వారందరికీ నోటీసులు అందాయి. ఈ కేసు విషయంలో ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి.

మనీష్ మెడకు ఎక్సైజ్ పాలసీ..
ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం విధానం ఈ దాడులకు ప్రధాన కారణం. ఈ పాలసీని ఆమోదించడం వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు అందడం వల్ల సీబీఐ అధికారులు ఈ మెరుపు దాడులను నిర్వహించారు. ఎక్సైజ్ పాలసీని లిక్కర్ మాఫియా ఒత్తిళ్ల మేరకు, వారికి అనుకూలంగా దీన్ని రూపొందించారనే విమర్శలను ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దీన్ని బలపరిచేలా తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన పశ్చిమ ఢిల్లీ లోక్సభ సభ్యుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

లుక్ అవుట్ నోటీస్..
మనీష్ సిసోడియా, అరవ గోపీకృష్ణ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారి, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్తో పాటు 10 మంది లిక్కర్ లైసెన్స్దారులపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో కొందరికి ఈ ఉదయం లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేశారు. మద్యం పాలసీని రూపొందించడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఫిర్యాదుల మేరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీలో చేరాలంటూ ఆహ్వానం..
సీబీఐ దాడులను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకు భారతీయ జనతా పార్టీ నుంచి ఆహ్వానం అందిందని మనీష్ సిసోడియా తాజాగా బాంబు పేల్చారు. తమ పార్టీలో చేరితో సీబీఐ గానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు క్లోజ్ అవుతాయంటూ బీజేపీ నాయకులు తనకు సందేశాన్ని పంపించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కాషాయ కండువా కప్పుకొన్న వెంటనే సీబీఐ, ఈడీ దాడులను నిలిపివేస్తామని మధ్యవర్తుల ద్వారా ఒత్తిడిని తీసుకొచ్చారని మనీష్ సిసోడియా వివరించారు.

తల నరుక్కుంటా గానీ..
తాను మహారాణా ప్రతాప్ వంశానికి చెందిన వాడినని, రాజ్పుత్నని బీజేపీ నాయకులకు గుర్తు చేస్తోన్నానని మనీష్ సిసోడియా చెప్పారు. తల నరుక్కుంటాను గానీ అవినీతిపరులు-కుట్రదారుల ముందు మోకరిల్లబోనని స్పష్టం చేశారు. తనపై నమోదు చేసిన కేసులన్నీ అసత్యాలు, అబద్ధాలతో నిండివున్నవని, ఏం చేసుకోంటారో.. చేసుకోండి.. అని ఆయన కమలనాథులకు సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోనని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications