తెలంగాణతో లింక్: సీబీఐ దర్యాప్తు ముమ్మరం: డిప్యూటీ సీఎంకు అష్టదిగ్బంధనం: ఐఎఎస్కూ
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ షాక్ ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేసింది. ఆయన నివాసంలో సోదాలను నిర్వహించిన రెండో రోజే సీబీఐ అధికారులు లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ప్రమేయం ఉన్న వారందరికీ ఈ సర్కులర్లు అందాయి. వారిలో ఎక్సైజ్ కమిషన్ అరవ గోపీకృష్ణ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈడీ కూడా..
మనీష్ సిసోడియా, అరవ గోపీకృష్ణ సహా పలువురి నివాసంలో ఏక కాలంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు కొనసాగించిన విషయం తెలిసిందే. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే కేసులో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా జోక్యం చేసుకోవడానికి రంగం సిద్ధమౌతోంది.
మద్య విధానం..
ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం విధానం ఈ దాడులకు ప్రధాన కారణం. ఈ పాలసీని ఆమోదించడం వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు అందడం వల్ల సీబీఐ అధికారులు ఈ మెరుపు దాడులను నిర్వహించారు. ఎక్సైజ్ పాలసీని లిక్కర్ మాఫియా ఒత్తిళ్ల మేరకు, వారికి అనుకూలంగా దీన్ని రూపొందించారనే విమర్శలను ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దీన్ని బలపరిచేలా తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన పశ్చిమ ఢిల్లీ లోక్సభ సభ్యుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణతో లింకులు..
ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించిన ఎక్సైజ్ పాలసీకి- తెలంగాణకు లింకులు ఉన్నాయని బాంబు పేల్చారు. తెలంగాణ లిక్కర్ మాఫియాతో మనీష్ సిసోడియాకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కాంట్రాక్ట్ను కుదుర్చుకోవడానికి మనీష్ సిసోడియా స్వయంగా తెలంగాణకు వెళ్లారని చెప్పారు. అక్కడ ఏయే హోటళ్లు, రెస్టారెంట్లల్లో మనీష్ సిసోడియా, ఆయన అనుచరులు గదులను బుక్ చేసుకున్నారనే వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని పర్వేష్ వర్మ వివరించారు.
లుక్ అవుట్
వాటి ఆధారంగానే సీబీఐ తాజాగా ఈ దాడులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇందులో 10-15 మంది ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది, మనీష్ సిసోడియాకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇందులో నుంచి ఆయన తప్పించుకోలేరని అన్నారు. దీని ఆధారంగా సీబీఐ అధికారులు ఇప్పుడు తాజాగా మనీష్ సిసోడియాకు లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేశారు. ఆయన ఎటూ వెళ్లకుండా ఉండేలా ముందుజాగ్రత్త చర్యగా దీన్ని ఇష్యూ చేసినట్లు చెబుతున్నారు.
అరెస్ట్ చేస్తారంటూ..
తనను రెండు రోజుల్లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ మనీష్ సిసోడియా ఇదివరకే స్పందించారు. తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నాననీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం తమను సీబీఐ అధికారుల దాడులో ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.