మోడీ కుట్ర... ఇటు పెళ్లి వేడుక, అటు సీఎం ఇంటిపై సిబిఐ దాడి!
ఢిల్లీ: కుమార్తె పెళ్లి మరికాసేపట్లో జరగాల్సి ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తరహా చర్యలను చేపట్టడం దారుణమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శనివారం నాడు తీవ్రంగా ఖండించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ నివాసాలపై సిబిఐ దాడులు జరిగాయి.
దీనిపై ఆజాద్ స్పందించారు. ఓ వైపు వధువు తరఫు బంధుమిత్రులు, వరుడి తరఫు వారు, అతిథులు అంతా పెళ్లి కోసం తరలి వెళ్తుంటే మోడీ ప్రభుత్వం ప్రతీకారేచ్చతో గుడ్డిదైపోయి దాడులకు తెగబడిందంటూ విమర్శించారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఈ చర్యను ఖండించింది.
అసోం సీఎం తరుణ్ గొగాయ్ ఈచర్య గర్హనీయమని గౌహతిలో పేర్కొన్నారు. మరోవైపు, సీబీఐ తనిఖీలు నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ సింగ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలంటూ బిజెపి డిమాండ్ చేసింది.

వీరభద్ర సింగ్కు పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, కాంగ్రెస్ పార్టీ అన్నిరకాల అవినీతికి మాతృక అనీ కేంద్రమంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మండిపడ్డారు. బిజెపి కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ... అవినీతికి మారుపేరు వీరభద్ర సింగ్ అన్నారు.
ఆయనంతట ఆయనే రాజీనామా చేయాలని, లేదంటే కాంగ్రెస్ నాయకత్వం ఆయనపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, కేంద్ర మాజీమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ దివంగత నేత అర్జున్సింగ్ భార్యను తక్షణమే భవంతులు ఖాళీ చేయాలంటూ కేంద్ర పట్టణ అభివృద్ధిమంత్రిత్వశాఖ తాఖీదులిచ్చింది.
వీరభద్ర సింగ్కి కేటాయించిన ఇంటిని వసతుల కల్పన కేబినెట్ కమిటీ (సీసీఏ) ఈ ఏడాది ఏప్రిల్లో రద్దు చేసింది. కొనసాగడానికి అనుమతి ఇవ్వాలని ఆయన డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్కి లేఖ రాశారు. ఇది కాకుండా కేంద్ర మాజీమంత్రి అబ్దుల్లా, దివంగత అర్జున్సింగ్ భార్య సరోజ్ కుమారిలకు సైతం భవనాలు ఖాళీచేయాల్సిందిగా కొద్దిరోజుల కిందట నోటీసులిచ్చారు.
2011లో అర్జున్ సింగ్ మరణించాక ఢిల్లీలోని కేనింగ్లేన్ భవంతిలో ఉండటానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుమతిచ్చింది. 2016 వరకు గడువు నిర్ణయించింది. తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ ఉత్వర్వులు రద్దు చేసింది. 2014లో పదవి కోల్పోయినా అబ్దుల్లా తీన్మూర్తి లేన్ భవంతిలో ఉంటున్నారు. ఆయనను అక్కడే కొనసాగించాల్సిందిగా గతంలో హోంమంత్రిత్వశాఖ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సూచించింది. దీనిపై వసతుల కల్పన కమిటీదే తుది నిర్ణయమని పట్ణణ అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications