లిక్కర్ స్కాంలో దొరకలేదు కదా అని.. మరో రూటులో నరుక్కొస్తోన్న మోదీ-సీబీఐ
న్యూఢిల్లీ: భారతీయ జనత పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తన రాజకీయ ప్రత్యర్థులపై దాడులను మరింత తీవ్రతరం చేసినట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసింది కేంద్రం. లిక్కర్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను ప్రయోగించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సైతం విచారించింది.

లిక్కర్ స్కాంలో..
తెలంగాణ ప్రభుత్వంలో సైతం ప్రకంపలను సృష్టించిన అంశం ఇది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవితతో పాటు అధికార టీఆర్ఎస్కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులకు కూడా ఇందులో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు నిరూపించే ప్రయత్నం చేశారు బీజేపీ నాయకులు. కొన్ని రోజుల పాటు సీబీఐ, ఈడీ అధికారులు లిక్కర్ స్కాంలో విస్తృతంగా దర్యాప్తు సాగించినప్పటికీ.. పెద్దగా పురోగతిని సాధించనట్లే.

బస్సుల కొనుగోళ్లపై..
ఈ పరిస్థితుల మధ్య మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై సీబీఐ దృష్టిం సారించనుంది. లిక్కర్ స్కాంలో కీలక లీడ్స్ ఏవీ లభించని ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు సీబీఐ మరో కొత్త అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు మొదలు పెట్టబోతోంది.

1,000 బస్సులు..
దీనికి అవసరమైన అన్ని అనుమతులను కూడా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కొద్దిసేపటి కిందటే జారీ చేశారు. సీబీఐతో సమగ్ర విచారణ జరిపించడానికి ఆయన అంగీకారం తెలిపారు. 1,000 లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలులో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాల్సి ఉందంటూ సీబీఐ అధికారులు అందజేసిన ప్రతిపాదనలపై లెప్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు.

ఎల్జీ అనుమతి..
బస్సులను కొనుగోలు చేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, దీనికి రవాణ శాఖ మంత్రిని ఛైర్మన్గా అపాయింట్ చేయడం సరికాదంటూ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈ ఏడాది జూన్లో ఫిర్యాదులు అందాయి. ఇందులో అవినీతికి పాల్పడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. దీనిపై తాజాగా ఎల్జీ వీకే సక్సేనా సీబీఐతో విచారణ జరిపించడానికి అంగీకరించారు.

బీఎస్ స్టేజ్-6 బస్సులు..
2019లో జులైలో ఢిల్లీ ప్రభుత్వం 1,000 లో ఫ్లోర్ భారత్ స్టేజ్-4, స్టేజ్-6 బస్సులను కొనుగోలు చేసింది. ఆ మరుసటి ఏడాది మరిన్ని బీఎస్-5 బస్సులను ప్రొక్యూర్ చేసింది. టెండర్లను జారీ చేయడంలో అవినీతి చోటు చేసుకుందంటూ తాజాగా ఫిర్యాదులు అందడం, ఆయన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల కొనుగోలు వ్యవహారం తెరమీదికి వచ్చింది.












Click it and Unblock the Notifications