twitter ను తుడిచిపెట్టేందుకు కేంద్రం యత్నం .. ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. ట్విట్టర్ను నియంత్రించే ప్రయత్నాలపై కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైక్రో బ్లాగింగ్ సైట్ను ప్రభావితం చేయడం కోసం మొదట ప్రయత్నం చేసిందని, అలా చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని పూర్తిగా తుడిచి పెట్టడం కోసం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. అదే సమయంలో మమతా బెనర్జీ కేంద్రం తమ మాట వినని వారిని, తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని, అయితే తనను కాని, తన ప్రభుత్వాన్ని కానీ తుడిచి పెట్టడం వారి వల్ల కాదంటూ మండిపడ్డారు. ట్విట్టర్ పై కేంద్రం చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని మమతాబెనర్జీ పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ హింస కొనసాగుతున్నట్లు బిజెపి ఆరోపణలను వెలుగులోకి తెచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది "జిమ్మిక్" అని, చేసిన వాదనలు పూర్తిగా "నిరాధారమైనవి" అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ హింసలు జరగడం లేదు. ఒకటి లేదా రెండు అప్పుడప్పుడు సంఘటనలు జరిగి ఉండవచ్చు, కాని వాటిని రాజకీయ హింస సంఘటనలుగా ముద్రించలేమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక బెంగాల్ లో రాజకీయ హింస ను ప్రేరేపిస్తుంది బిజెపి నాయకులే అంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
ఐటి నిబంధనలను పాటించకపోవడం మరియు కొత్త మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరి చేసిన ముఖ్య సిబ్బందిని నియమించడంలో వైఫల్యం కారణంగా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం భారతదేశంలో తన "సేఫ్ హార్బర్" కవచాన్ని కోల్పోయింది. థర్డ్ పార్టీ చట్టవిరుద్ధమైన కంటెంట్ కోసం ఇది ఇప్పుడు భారత శిక్షాస్మృతి క్రింద చర్యకు బాధ్యత వహిస్తుంది.