'ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.25 వేలు!'.. అసలు విషయం తెలిసి షాక్!
నోట్ల రద్దు తర్వాత బయటపడ్డ నల్లధనాన్ని దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.25వేల కింద జమ చేస్తున్నారని గురువారం ఉదయం సోషల్ మీడియాలో జోరుగా వదంతులు వ్యాపించాయి.
చెన్నై : నోట్ల రద్దు తర్వాత బయటపడ్డ నల్లధనాన్ని దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.25వేల కింద జమ చేస్తున్నారని గురువారం ఉదయం సోషల్ మీడియాలో జోరుగా వదంతులు వ్యాపించాయి. కొంతమంది సెల్ ఫోన్లకు దీనికి సంబంధించిన సందేశాలు కూడా వెళ్లడంతో.. ఉదయం లేవగానే చాలామంది బ్యాంకుల ముందు వాలిపోయారు.
తమళినాడులోని దిండుగల్ జిల్లా కొడైకెనాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. రూ.25 వేల నగదు డిపాజిట్ అయినట్లు వచ్చిన వదంతులను నమ్మి జనమంతా బ్యాంకుల ఎదుట కిక్కిరిసిపోయారు. నోట్ల రద్దతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్న కేంద్రం ఈ చర్య ద్వారా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని భావిస్తుందని.. లేని పుకార్లను కొంతమంది సృష్టించారు.
ఇది నిజమే నమ్మిన జనం బ్యాంకులకు పరిగెట్టారు. తీరా బ్యాంకుకు వెళ్లాక అక్కడి అధికారులు చెప్పిన మాట విని తెల్లమొహం వేశారు. నగదు డిపాజిట్ చేసే చర్యలేవి కేంద్రం చేపట్టలేదని, అదంతా వట్టి పుకారేనని బ్యాంకు అధికారులు తేల్చేయడంతో నివ్వెరపోవడం ఖాతాదారుల వంతు అయింది. వదంతుల నేపథ్యంలో.. కేంద్రం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే జనం విశ్వసించాలని అధికారులు సూచిస్తున్నారు.