కేంద్రం చర్యలు నమ్మకద్రోహమే-ప్రధానితో భేటీలో కశ్మీర్ అఖిపక్ష నేతలు
జమ్ముకశ్మీర్ భవిష్యత్తును తేల్చేందుకు నిన్న ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన కీలక భేటీకి హాజరైన అఖిలపక్ష నేతలు తమ అభిప్రాయాల్ని ఆయనకు నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది. మోడీతో జరిగిన భేటీలో వరుసగా తమ అభిప్రాయాలు పంచుకున్న కశ్మీర్ నేతలు కేంద్రం ఆర్టికల్ 370 రద్దుతో పాటు కశ్మీర్లో తీసుకున్న చర్యలన్నింటినీ వారు తప్పుబట్టినట్లు సమాచారం.
తీవ్రవాద నిర్మూలన పేరుతో జమ్ముకశ్మీర్ను రెండు ముక్కలుగా చేయడం, ప్రత్యేక రాష్ట్ర హోదా రద్దు చేయడం, రాజకీయ నేతల నిర్బంధాలు వంటి చర్యలు అక్కడి ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన నమ్మకద్రోహమేనని కశ్మీర్ అఖిలపక్ష నేతలు ప్రధాని మోడీకి స్పష్టం చేశారు. 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరిగి ప్రజల్లో విశ్వాసం నింపేందుకు తక్షణం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఎన్నికలు జరిపించాలని వారు ప్రధానిని కోరారు.
జమ్ముకశ్మీర్ ప్రజల్లో కేంద్రంపై విశ్వాసం నింపడమే తక్షణ కర్తవ్యమని ప్రధానికి చెప్పినట్లు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ సైతం తమ ఐధు డిమాండ్లలో రాష్ట్ర హోదా పునరుద్దరణ ఉందన్నారు. మరోవైపు నిన్న ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో గుప్కర్ అలయన్స్ నేతలు ఆర్టికల్ 370 పునరుద్ధరణను కోరలేదు.
దీనికి కారణం ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు విచారణ పెండింగ్లో ఉండటమే. అయితే ఆర్టికల్ 370 తమకు ఇచ్చింది మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి వల్లభాయ్ పటేల్ అని పాకిస్తాన్ కాదని మరో నేత మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.