ఆర్మీకి మీ సేవలు అవసరం అయ్యాయ్- సిద్ధంకండి
India Pakistan War: పాకిస్తాన్పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది.
భారత్ మిస్సైళ్ల దాడులతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. లాహోర్, సియాల్ కోట్ వంటి నగరాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ప్రత్యేకించి- సియాల్ కోట్. దాదాపుగా ఏడున్నర లక్షల మంది వరకు జనాభా ఉండే ఈ సిటీ ఖాళీ అవుతోంది.

తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది.
భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. దేశ రాజధాని సౌత్ బ్లాక్లో ఈ భేటీ ఏర్పాటైంది. పాకిస్తాన్పై ఇప్పటివరకు జరిగిన ఎదురుదాడులపై సమీక్ష నిర్వహించారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఇందులో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులు, దేశ పశ్చిమ ప్రాంతంలో చోటు చేసుకుంటోన్న తాజా పరిణామాల గురించి మంత్రి ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948లోని రూల్ నంబర్ 33 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అధికారాల ఆధారంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన ఏ ఉద్యోగి అయినా, ఏ జవాన్ అయినా, ఏ అధికారిని అయినా ఆర్మీ చీఫ్.. దేశ రక్షణ అవసరాల్లో వినియోగించుకోవచ్చు. రెగ్యులర్ ఆర్మీకి సహాయకులుగా ఉపయోగించుకోవచ్చు.
32 ఇన్ఫ్రాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ), 14 ఆర్మీ బెటాలియన్ను సదరన్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, నార్తరన్ కమాండ్, సౌత్-వెస్టర్న్ కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్ అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్లల్లో మోహరింపజేయవచ్చు.
ఈ టెరిటోరియల్ ఆర్మీలో పలువురు సెలెబ్రిటీలు ఉన్నారు. మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ వంటి పలువురు సెలెబ్రిటీలు ఆర్మీలో వివిధ గౌరవ హోదాల్లో ఉన్నారు. వారి సేవలను కూడా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆర్మీ చీఫ్కు సూచించింది.












Click it and Unblock the Notifications