సెంట్రల్ విస్టా కీలక, అత్యవసర జాతీయ ప్రాజెక్టు: పనులు ఆపే ప్రసక్తే లేదన్న హైకోర్టు, వారికి లక్ష జరిమానా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకునే ప్రసక్తే లేదని సోమవారం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ లతో కూడిన ధర్మానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

సెంట్రల్ విస్టా కీలక, అత్యవసర జాతీయ ప్రాజెక్టు..
కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు స్పష్టం చేసింది. ఇది ఎంతో ముఖ్యమైన, అత్యవసర జాతీయ ప్రాజెక్టు అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు నిలిపేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, కోర్టు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప.. పిల్ కాదని వ్యాఖ్యానిస్తూ డిస్మిస్ చేసింది.

పిటిషనర్లకు రూ. లక్ష జరిమానా విధించిన హైకోర్టు..
అంతేగాక, పిటిషనర్లకు రూ. లక్ష జరిమానా కూడా విధించింది. సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి హైకోర్టు ప్రస్తావించింది. పనులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్కడా లేదని కోర్టు పేర్కొంది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అడ్డుకునేందుకు దురుద్దేశపూర్వకంగానే కోర్టులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. మరోవైపు షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ సంస్థ కూడా తమ కంపెనీలో పనిచేసే సిబ్బంది రక్షణ బాధ్యతను తాము చూసుకుంటామని స్పష్టం చేసింది.

సెంట్రల్ విస్టాపై విషం కక్కవచ్చు కానీ.. తుషార్ మెహతా వాదనలు
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టులో వాదనలు వినిపించారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా నిర్మించిన 'ఆష్విట్జ్' క్యాంపులతో నిర్మాణ పనులను పిటిషనర్లు పోల్చడంపై తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శించవచ్చు, విషం కక్కవచ్చు కానీ.. అలాంటి పదాలు ఉపయోగించరాదని ఘాటుగా స్పందించారు. ఇతర నిర్మాణాల వద్ద కార్మికుల యోగక్షేమాలు మాత్రం ఈ పిటిషనర్లకు పట్టవా? అని ప్రశ్నించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనుల వద్ద కార్మికులు, సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఇలా ఉండబోతంది..
ఈ ప్రాజెక్టు రాజ్పథ్, చుట్టుపక్కల పచ్చిక బయళ్లలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిర్మాణ కార్యకలాపాలను కలిగిస్తుందని న్యాయవాదులు గౌతమ్ ఖాజాంచి, ప్రద్యుమాన్ కైస్తా ద్వారా దాఖలు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ హౌస్, గృహ కార్యాలయాలకు, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతికి కొత్త నివాస సముదాయం నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ సంకల్పించింది. వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు అనుగుణంగా కొత్త కార్యాలయ భవనాలు, కేంద్ర సచివాలయం కూడా ఇందులో ఉంటుంది. కాగా, ఇప్పటికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనుుల ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications