వ్యాపార సముదాయాలు తెరిచేందుకు కేంద్రం ఓకే.. మాల్స్కు మాత్రం నో, కండీషన్స్ ఆప్లై...
నిబంధనల మేరకు దరఖాస్తు చేసిన వ్యాపార సముదాయాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆ షాపులు రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో మాత్రమే ఉండాలని షరతు విధించింది. అయితే షాపింగ్ మాల్స్లో ఉండే షాపులను తెరిచేందుకు మాత్రం కేంద్ర హోంశాఖ అనుమతించలేదు.
రాష్ట్ర/కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిస్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిష్టర్ చేసుకున్న వ్యాపార సముదాయాలను తెరిచేందుకు హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది. మున్సిపాలిటీ శివారు, మున్సిపాలిటీలో 50 శాతం మంది సిబ్బందితో ఓపెన్ చేయొచ్చని తెలిపింది. సిబ్బంది విధిగా మాస్క్ ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని షరతు విధించింది. అత్యవసర సర్వీస్ కోసం ఆస్పత్రి, మెడికల్ షాపులను తెరుస్తుండగా... కిరణా షాపులను అనుమతిస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ మిగతా వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అనుమతి ఇచ్చింది.
గతనెల 24వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొదటివిడత ఏప్రిల్ 14వ తేదీతో ముగియగా.. దానికి మే 3 వరకు పొడిగించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 23 వేల 452 కాగా.. 4 వేల 814 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 17 వేల 915 మందికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. చనిపోయిన వారి సంఖ్య 723కి చేరిందని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.