లదాఖ్ అఖిలపక్ష నేతలతో జులై 1న కేంద్రం సమావేశం... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన...
కేంద్రం మరో కీలక సమావేశానికి సిద్దమవుతోంది. లదాఖ్,కార్గిల్లకు కి చెందిన రాజకీయ పార్టీలు,సామాజిక కార్యకర్తలతో జులై 1న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జమ్మూకశ్మీర్ రాజకీయ పక్షాలతో భేటీ అయిన కొద్దిరోజులకే లదాఖ్,కార్గిల్ నేతలతోనూ కేంద్రం భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా ఏంటన్నది ఇప్పటికైతే వెల్లడి కాలేదు.
అగస్టు 5,2019న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ను రెండుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్,లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన జరిగింది. జమ్మూకశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లదాఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. లదాఖ్లో రెండు జిల్లాలు ఉన్నాయి. ఒకటి లేహ్,మరొకటి కార్గిల్. ఇక్కడి జనాభాలో 98శాతం గిరిజనులే ఉన్నారు.
కాగా,రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ రాజకీయ పార్టీలతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ... రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయమై జమ్మూకశ్మీర్ నేతలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దానిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. అలాగే జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమావేశంలో మోదీ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజలకు భద్రత,రక్షణతో కూడిన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యత అని చెప్పారు.
ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ నేతలు మాట్లాడుతూ...వీలైనంత త్వరగా అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. బ్యూరోక్రసీ ప్రభుత్వంలో ఒక భాగమని... అంతే తప్ప ప్రభుత్వాన్ని అది భర్తీ చేయలేదని అభిప్రాయపడ్డారు. అలాగే తక్షణమే జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సమావేశంలో పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కొంతమంది నేతలు జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించాలని కోరగా... ఆ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉండటంతో దానిపై పెద్దగా చర్చించలేదని సమాచారం.
అగస్టు 5,2019న జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన తొలి సమావేశం ఇదే. జమ్మూకశ్మీర్లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించి... అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా ఈ సమావేశం ద్వారా తొలి అడుగు పడినట్లయింది.