జమ్మూకాశ్మీర్పై అనూహ్య నిర్ణయం - 10వేల కేంద్ర బలగాలు తక్షణమే వెనక్కి - హోంశాఖ ఆదేశం
ఆర్టికల్ 370 రద్దయి ఏడాది పూర్తయిన వేళ జమ్మూకాశ్మీర్ పై మోదీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాల నుంచి 100 కంపెనీలను ఉపసంహరించుకుంది. జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా డ్యూటీల్లో ఉన్న ఆయా బలగాలు తక్షణమే వెనక్కి వచ్చేయాలంటూ కేంద్ర హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
గతేడాది ఆగస్టు 5న.. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీర్, లదాక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆందోళనల్ని నివారించేందుకుగానూ కేంద్రం అదనంగా 400 కంపెనీల బలగాలను అక్కడికి పంపింది. గడిచిన ఏడాది కాలంలో కాశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో బలగాల ఉపసంహరణకు కేంద్రం ఆదేశాలిచ్చింది.

జమ్మూకాశ్మీర్ నుంచి వెనక్కి రావాలంటూ 100 కంపెనీల బలగాలకు ఆదేశాలివ్వగా, అందులో సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన 40 కంపెనీలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) 20, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)20, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్)కు చెందిన 20 కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీలో 100 నుంచి 110 మంది జవాన్లుంటారు. ఆ లెక్కన దాదాపు 10వేల పారామిలటరీ బలగాలను కేంద్రం కాశ్మీర్ నుంచి ఉపసంహరించుకున్నట్లయింది. వీరంతా తమ పాత స్థానాల్లోకి వెళ్లిపోవాల్సి ఉంటుందని హోం శాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ లో, ప్రత్యేకించి కాశ్మీర్ లోయలో టెర్రరిజం వైపు ఆకర్షితులయ్యేవారి సంఖ్య తగ్గింది. భారీ ఎత్తున బలగాల మోహరింపు, భారతీయత భావం పెరగడమే ఇందుకు కారణమని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. గడిచిన ఏడాది కాలంలో కేవలం 67 మంది మాత్రమే టెర్రరిస్టు గ్రూపుల్లో చేరారని, వాళ్లలో చాలా మందిని ఇప్పటికే ఏరేసినట్లు సైనికవర్గాలు తెలిపాయి. బుధవారం 100 కంపెనీల పారామిలటరీ బలగాలను వెనక్కి తీసుకున్న కేంద్రం.. కాశ్మీర్ లో ఇంకా ఉన్న 300 కంపెనీల బలగాలపైనా వచ్చే నెలలలో రివ్యూ మీటింగ్స్ తర్వాత నిర్ణయం తీసుకోనుందని అధికారవర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications