ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిపై కేంద్రం కీలక నిర్ణయం
CEC Rajiv Kumar: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.
మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన తొలి విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. దీనికి అవసరమైన నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. తమిళనాడు సహా మొత్తం 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.

జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ ముగస్తుంది. కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ.
అటు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను ముగించడానికి కసరత్తు సాగిస్తోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. అలాంటి పోలింగ్ బూత్లల్లో వెబ్ క్యామ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనుంది.
ఆయా ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపరమైన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.. దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సీఈసీ రాజీవ్ కుమార్కు భద్రతను కల్పించింది. ఆయనకు జెడ్ కేటగిరి భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రీయ రిజర్వ్ పోలీసు బలగాలతో కూడిన భద్రత వ్యవస్థ ఇది. దేశవ్యాప్తంగా ఈ భద్రత ఆయనకు వర్తిస్తుంది. సీఈసీ రాజీవ్ కుమార్ దేశంలో ఎక్కడికి వెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్ల కవచంలో ఉంటారాయాన.












Click it and Unblock the Notifications