వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్
ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందా..? ఇందుకోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ఉందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది..? ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి...?
ఉద్యోగాల భర్తీ కోసం నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ
ఇకపై కేంద్రప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కోసం నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ (ఎన్ఆర్ఏ)పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ, మరియు గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ కామన్ టెస్టు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రస్తుతం 1.5 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ (డీఓపీటీ)ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉద్యోగాల భర్తీని చేపడుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 18 నుంచి 20 నెలల సమయం పడుతోంది.
మూడు నెలల సమయంలో ఒకే పరీక్ష ద్వారా ఉద్యోగాల భర్తీ
ఇక కొత్తగా నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ చేతుల్లోకి ప్రక్రియ వ్యవస్థ వెళితే కేవలం మూడు నెలల సమయంలోనే ఉద్యోగాల భర్తీ జరిగిపోతుందని డీఓపీటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ త్వరగా ఏర్పాటు అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా వేగవంతం అవుతుందని తెలిపారు. అంతేకాదు చాలామటుకు ఉద్యోగాలకు అర్హత కూడా 10 లేదా 12వ తరగతి లేదా డిగ్రీ ఉత్తీర్ణతే కావడంతో వీటన్నిటికీ వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడంకంటే... ఒకే పరీక్ష ద్వారా ఉద్యోగాల భర్తీ చేపడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష తర్వాత ఆయా పోస్టులకు వేర్వేరు కటాఫ్ మార్కుల నిర్ణయించి తద్వారా నియామకాలు చేపడితే బాగుంటుందని డీఓపీటీలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కటాఫ్ మార్కుల ద్వారా అభ్యర్థులకు ఉద్యోగాలు
ఒకే పరీక్ష నిర్వహించడం వల్ల పలు పోస్టుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకునే శ్రమ కూడా తగ్గుతుందని అదే సమయంలో అప్లికేషన్లపై కన్ఫ్యూజన్ కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక్కో అభ్యర్థి ఒక్కో ఉద్యోగం కోసం వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటారని.. ఏదో ఒక పోస్టు రాకపోతుందా అన్న ఉద్దేశంతో వారు దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. దీంతో అప్లికేషన్ల సంఖ్య లక్షలు దాటుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అదే ఒకటే కామన్ పరీక్ష ఉంటే ఒకే అప్లికేషన్తో ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని చెప్పారు. కటాఫ్ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధానం అమలు చేస్తే వేర్వేరు పరీక్షలకు వేర్వేరుగా హాజరు అవ్వాల్సిన బాధ కూడా అభ్యర్థులకు తప్పుతుందని డీఓపీటీ అధికారులు తెలిపారు. అంతేకాదు కామన్ పరీక్షలో వచ్చిన మార్కులు మూడేళ్ల వరకు చెల్లుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో బోర్డు ఏర్పాటు
ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో డిసెంబరు 31లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం ఆయా సంస్థలకు యాక్షన్ ప్లాన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతాయని అదే సమయంలో ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థ కిందే ఉద్యోగాల భర్తీని ఈ నేషనల్ రిక్రూట్మెంట్ అథారిటీ చేపడుతుందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ పూర్తి చేయకపోవడంపై మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి కూడా కోటా కల్పిస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది.