జ్వరానికి పారాసిటమాల్: సెకెండ్ వేవ్తో విధ్వంసం: ఉచితంగా వ్యాక్సిన్: మోడీ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్రజలు ఎదుర్కొన్నారని, దాన్ని నిర్మూలించగలిగారని అన్నారు. సెకెండ్ వేవ్ మాత్రం విధ్వంసానికి దారి తీసిందని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు తమ ఆప్తులను కోల్పోయారని మోడీ వ్యాఖ్యానించారు. దీన్ని సైతం ధీటుగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సెకెండ్ వేవ్ను ధీటుగా ఎదుర్కొనడానికి అవసరమైన చర్యల కోసం వైద్య నిపుణులను తాను సంప్రదిస్తున్నానని అన్నారు.
తన మన్ కీ బాత్ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శశాంక్, శ్రీనగర్కు చెందిన డాక్టర్ నవీద్తో ఆయన సంభాషించారు. ఆయనతో సాగించిన సంభాషణలను వినిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ సోకిన తరువాత పేషెంట్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని అన్నారు. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలను వినియోగించాలని సూచించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు ఫోన్ ద్వారా డాక్టర్లతో తరచూ మాట్లాడుతూ ఉండాలని, వారిచ్చే సూచనలను పాటించాలని అన్నారు.

వైరస్ లక్షణాలు లేనప్పటికీ.. వేలాదిమంది కరోనా బారిన పడుతున్నారని డాక్టర్ నవీద్ తెలిపారు. కరోనా సోకినట్లు తెలియగానే ఉద్రిక్తతలకు లోనుకాకుండా ఉండాలని సూచించారు. సకాలంలో నాణ్యమైన వైద్యాన్ని తీసుకోవడం ద్వారా కరోనా నుంచి బయట పడొచ్చని చెప్పారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న పేషెంట్లు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయని, వాటి ఎఫీషియన్సీ బాగుందని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల గురించి నమ్మొద్దని డాక్టర్ నవీద్ సూచించారు. వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చెప్పారు.
రాయ్పూర్కు చెందిన భావన ధృవ్, బెంగళూరుకు చెందిన సురేఖ అనే నర్సులు, ప్రేమ్ వర్మ అనే అంబులెన్స్ డ్రైవర్, కోవిడ్ నుంచి కోలుకున్న గుర్గావ్ మహిళ ప్రీతి చతుర్వేదితో మోడీ మాట్లాడారు. ఏ వ్యాక్సిన్ కూడా అప్పటికప్పుడు ప్రభావం చూపదని సురేఖ తెలిపారు. రోగ నిరోధక శక్తిని అది క్రమంగా పెంచుతుందని అన్నారు. అవనసరంగా చేతులతో కళ్లు, చెవులు, ముక్కు, నోటిని తాకొద్దని, దాని వల్లే కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్తుందని సురేఖ చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్లు, అంబులెన్స్ డ్రైవర్లు దేవదూతల్లా కనిపిస్తున్నారని మోడీ వ్యాఖ్యానించారు.
రోగ నిరోధక శక్తిని పెంచుకోగలగడం ద్వారా కరోనాను జయించవచ్చని ప్రీతి చతుర్వేది తెలిపారు. తాను వేగంగా కరోనా నుంచి కోలుకున్నానని అన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజులు, యోగా, ప్రాణాయామం చేయడంతో పాటు సకాలంలో పౌష్టికాహారాన్ని తీసుకున్నానని మోడీకి వివరించారు. భగవాన్ మహావీర్ జయంతి, బుద్ధ పౌర్ణమి, రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని మోడీ దేశ ప్రజలకు తన శుభాకాంక్షలను తెలిపారు. కరోనా బారి నుంచి దేశం వేగంగా కోలుకుంటుందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోడీ అకాంక్షించారు.












Click it and Unblock the Notifications