లాక్డౌన్: జన్ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాల్లో 3 నెలలపాటు రూ. 500 చొప్పున జమ చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జన్ ధన్ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది.
కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా గుమిగూడకుండా ఈ అంక్షలు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఏప్రిల్ 3న నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఇక ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవారు ఏప్రిల్ 4న, ఖాతా చివరన 4 లేక 5 ఉన్నవారు ఏప్రిల్ 7, ఖాతా చివరన 6 లేక 7 అంకె ఉన్నవారు ఉన్నవారు ఏప్రిల్ 8న, 8 లేక 9 అంకె ఉన్నవారు ఏప్రిల్ 9 లోపు నగదు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే, ఏప్రిల్ 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్పై కేంద్రం మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. లాక్డౌన్ను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ జాబితాను రాష్ట్రాలకు పంపారు. లాక్డౌన్ అమలును ఉల్లంఘించేవారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని, ఈ మేరకు నిబంధనలను రాష్ట్రాలకు తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications