Open Toll Plazas : టోల్ ప్లాజాల దగ్గర ఇక ఆగక్కరలేదు-కేంద్రం కీలక ప్రకటన..
జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు మధ్యలో టోల్ ప్లాజాలు ఎదురవుతుంటాయి. వీటి దగ్గర వాహనాల తాకిడి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా పండగల సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది.దీంతో వాహనదారులు చికాకు పడుతున్నారు. కేంద్రం విధించిన టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నా ఇంకా ఈ ట్రాఫిక్ జామ్ ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న టోల్ ప్లాజాల్లో పలు మార్పులు చేయబోతోంది.
కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరమే ఉండదని కేంద్రం చెబుతోంది. టోల్ ప్లాజ్ యథావిధిగానే ఉంటుంది. కానీ మధ్యలో ఎవరూ వాహనాల్ని ఆపరు. దీనికి బదులుగా మరో పద్ధతిలో టోల్ విధింపు ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని ఆరునెలల్లో అమల్లోకి తెస్తామని గతంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ ఇవాళ వెల్లడించారు. కొత్త వ్యవస్ధ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల దగ్గర నిమిషం కూడా ఆగాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫాస్టాగ్ వ్యవస్ధలో టోల్ ప్లాజాల దగ్గర ఆగే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించగలిగినట్లు చెప్పిన ఆయన.. దీన్ని త్వరలో 30 సెకన్ల కంటే తక్కువకు తీసుకొస్తామన్నారు.
శాటిలైట్ వ్యవస్ధ, అత్యాధునిక కెమెరాల వినియోగంతో వస్తున్న ఈ కొత్త వ్యవస్ధలో టోల్ ప్లాజ్ వద్దకు వాహనాలు రాగానే స్కానర్లు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసుకుంటాయి. వెంటనే శాటిలైట్ ద్వారా ఈ సమాచారం సర్వర్ కు వెళ్లి టోల్ ఛార్జీ కట్ అవుతుంది. అలాగే జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గర నిర్ణీత ఛార్జీకి బదులుగా ఎంత దూరం ప్రయాణిస్తే అంత టోల్ మాత్రమే చెల్లించేలా కొత్త వ్యవస్ధకు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications