సెకండ్ వేవ్: పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2 నెలలపాటు ఉచిత ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే, జూన్ నెలల్లో ప్రజలకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గత సంవత్సరం ఇచ్చినట్లుగానే పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో దేశంలోని 80 కోట్ల లబ్ధిదారులైన ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలోని 80 కోట్ల మందికిపై లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు అందించనున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 26వేల కోట్లకుపైగా వెచ్చిస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో దేశ ప్రజలకు సరైన పౌష్టికాహారాన్ని ఆహారం అందివ్వాలని ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.
కాగా, గత సంవత్సరం కరోనా తొలి వేవ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద గత నవంబర్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించిన విషయం తెలిసిందే.
సెకండ్ వేవ్లో కరోనా కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 3.32 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 2263 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 1,62,63,695 కరోనా కేసులు నమోదు కాగా, 1,86,920 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications