వ్యాక్సిన్పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్
దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. వ్యాక్సిన్ కు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికే పలు రాష్ట్రాలకు టీకాల సరఫరా ప్రారంభమైంది. అంతేకాదు, వ్యాక్సినేషన్ ఖర్చుపైనా మోదీ క్లారిటీ ఇచ్చారు. టీకా డోసుల కోసం రాజకీయ నేతలు ఎగబడొద్దని ముందస్తు వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
కరోనా
కంటే
70%డేంజర్
బర్డ్
ఫ్లూ
-మనుషులకు
సోకితే
చావు
ఖాయం
-అసలేంటీ
H5N1
-చికెన్
తింటే
అంతేనా?
సీఎంలతో ప్రధాని కాన్ఫరెన్స్..
భారత్ లో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో తొలిసారిగా సోమవారం భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మోదీ.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక దిశానిర్దేశం చేశారు. రెండు విడతలుగా చేపట్టిన డ్రైరన్ ఫలితాలను విశ్లేషిస్తూ.. ఈ నెల 16వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కాబోయే వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమగ్రంగా చర్చలు జరిపారు. అందులో భాగంగానే...
తొలి 3కోట్ల డోసులకు ఖర్చు కేంద్రానిదే..
వ్యాక్సినేషన్ సన్నద్ధత, రాష్ట్రాల్లో తాజా పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సాయుధ బలగాలు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి దశలో మొత్తం మూడు కోట్ల మందికి టీకా ఇస్తామని.. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం వేయబోమని వెల్లడించారు. ఐతే టీకా కోసం రాజకీయ నాయకులు ఎగబడవద్దని.. వారి వంతు వచ్చినప్పుడు మాత్రమే టీకా తీసుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు.
మరో నాలుగు వ్యాక్సిన్లకు అనుమతి..
సమిష్టి కృష్టితోనే కరోనా క్రైసిస్ ను ఎదుర్కోగలిగామని ముఖ్యమంత్రులకు గుర్తుచేసిన ప్రధాని మోదీ.. ఆ దశకు భారత్ చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. తొలి దశలో ప్రయివేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా వారియర్లకు టీకాలు ఇస్తామని, రెండో దశలో 50ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మొత్తంగా రాబోయే కొన్ని నెలల్లోనే 30 కోట్ల మంది టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మనదేశంలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లకు అనుమతిచ్చామని, అవి విదేశీ టీకాల కంటే సమర్థవంతమైనవని స్పష్టం చేశారు. మరో నాలుగు టీకాలు కూడా అందుబాటులోకి తెస్తామని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు..
రాజకీయ నేతలకు ప్రధాని వార్నింగ్
కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి పూర్తిగా విదేశీ టీకాలపైనే ఆధారపడకుండా ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తున్నట్లు మోదీ తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ అవసరమైన అందరికీ అందుతుందా? అనే సందేహాలు అవసరం లేదని, వ్యాక్సినేషన్పై రియల్ టైమ్ డేటాను ఎప్పటికప్పుడు నిర్వహించాలని, టీకా తీసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వాలని, తద్వారా రెండో డోస్ ఇవ్వడం సులభమవుతుందని మోదీ సూచించారు. ఈ సందర్భంగా రాజకీయ నేతలను ఉద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలు తమ పలుకుబడితో ముందుగా వ్యాక్సిన్ పొందేందుకు ఎగబడొద్దని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. తొలి దశలో 3 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ తర్వాత మరోసారి భేటీ అవుదామని సీఎంలతో ప్రధాని అన్నారు.