వక్ఫ్ బిల్లుకు కేంద్రం లైన్ క్లియర్-జేపీసీ సిఫార్సుల ఆమోదం..!
దేశవ్యాప్తంగా ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధతను తేల్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ లో తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతంలో లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు తలెత్తిన అభ్యంతరాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించిన కేంద్రం.. ఇప్పుడు జేపీసీ ఇచ్చిన సిఫార్సుల్ని ఆమోదించింది. దీంతో తిరిగి దీన్ని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.
దేశంలోని ఆస్తుల్లో మూడో అతిపెద్ద ఆస్తి వక్ఫ్ భూములు, ఆస్తుల చట్టబద్ధతను నిర్ధారించేందుకు మోడీ సర్కార్ ఎప్పటి నుంచోప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టు 8న పార్లమెంట్ లో చట్ట సవరణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే దీనికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే కూటమిలోని పక్షాలు కూడా వ్యతిరేకత తెలపడంతో వెంటనే జేపీసీకి పంపుతున్నట్లు ప్రకటించి ఈ వివాదం నుంచి కేంద్రం తాత్కాలికంగా బయటపడింది.

ఆ తర్వాత బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో వివిధ పార్టీల ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వక్భ్ చట్టంపై అభిప్రాయాలు సేకరించి ఫిబ్రవరి 13న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీంతో జేపీసీ చేసిన 14 సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగంలో ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రివర్గం గత వారం జేపీసీ సిఫార్సులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా, వక్ఫ్ (సవరణ) బిల్లు కేంద్రం, రాష్ట్రాలలోని వక్ఫ్ బోర్డులను నియంత్రించే ప్రస్తుత వక్ఫ్ చట్టానికి 44 మార్పులను ప్రతిపాదించింది. సమాజ ప్రయోజనాల కోసం ముస్లింల మతపరమైన దానం అయిన వక్ఫ్ ఆస్తుల పాలన, నిర్వహణలో గణనీయమైన మార్పులు ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications