చెడ్డీ గ్యాంగ్ హల్చల్: చుక్కలు చూపించి.. ఇళ్లంతా లూటీ చేశారు..
ఇంట్లోకి చొరబడ్డ తర్వాత.. అక్కడున్న ముగ్గురు సోదరులను కొట్టి, మగవాళ్లందరిని ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత మహిళలందరిని వరుసలో నిలుచోబెట్టి.. వారి వద్ద ఉన్న బంగారాన్ని వలుచుకుపోయారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని గ్రామాల్లో చెడ్డీ గ్యాంగ్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకుంటోంది. చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఈ గ్యాంగ్ లో 8మంది సభ్యుల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంట్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్.. ఆ కుటుంబంలోని 12మందిని బంధీలుగా చేసి దోపిడీకి పాల్పడింది.
ఇంట్లోకి చొరబడ్డ తర్వాత.. అక్కడున్న ముగ్గురు సోదరులను కొట్టి, మగవాళ్లందరిని ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత మహిళలందరిని వరుసలో నిలుచోబెట్టి.. వారి వద్ద ఉన్న బంగారాన్ని వలుచుకుపోయారు. అనంతరం ఇంట్లో దాచిన డబ్బుతో పాటు, నగదు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. కోలార్-మిస్రాడ్ అనే నగరాల సరిహద్దులో గల హిన్నోటియా ఆలం అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనిపై పోలీసులకు సమాచారం అందించగా.. ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని వారు అనుమానిస్తున్నారు. కాగా, సాధారణంగా మే నెలలోనే చెడ్డీ గ్యాంగ్ ఎక్కువగా దోపిడీలకు పాల్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. దోపిడీ సమయంలో ఇంట్లోని బీరువాలు పగలగొట్టి, ఇంట్లోని ప్రతీ చోట గాలించారు. మహిళలంతా వేరే గదిలో దాక్కునేందుకు ప్రయత్నించినా.. తలుపులు బద్దలు కొట్టి మరీ.. దొంగలు అందులోకి ప్రవేశించారు. ఆపై వారి ఒంటి మీది బంగారాన్ని దోపిడీ చేశారు.