పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గోవాలో యువతిపై రేప్
పనాజి: మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ యువతి పరిచయం పెంచుకుని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఛండీగఢ్కు ఆమెను గోవాకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు బాధితురాలికి చెందిన బంగారు ఆభరణాలను కూడా దొంగిలించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వాలెంటినో ఫెర్నాండేస్, అతని తల్లి లియోసిడియాలు పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని సంకోయాలే గ్రామంలో నివాసం ఉంటున్నారు.
కాగా, నిందితుడు ఛండీగఢ్ రాష్ట్రానికి చెందిన 28ఏళ్ల యువతితో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను గోవాకు రావాలని కోరాడు. దీంతో ఆమె గోవాలోని నిందితుడి ఇంటికి వెళ్లింది.
నిందితుడు అతని నివాసంలోనే తనపై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటానని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది.
అంతేగాక, నిందితుడి తల్లి తన వద్ద ఉన్న రూ. 2లక్షల విలువైన బంగారు నగలను కూడా దోచుకుందని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు, అతని తల్లిని అరెస్ట్ చేశారు.