రైలు చార్జీ కన్నా తక్కువ: స్పైస్ జెట్ విమాన టికెట్ ధర రూ. 599
న్యూఢిల్లీ: విమానయాన కంపెనీలు తక్కువ ధరలతో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణీకులు ఆకర్షించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా రైలు చార్జీల కన్నా తక్కువ ధరకే స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్ను బుధవారం ప్రకటించింది.
ఈ ఆఫర్ కింద దేశీయ విమానాల్లో వన్ వే చార్జీ రూ. 599(అన్ని ట్యాక్స్లు కలిపి)కే అందిస్తుంది. ఇక విదేశీ రూట్లలో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని (కొలంబో, కాబుల్, దుబాయ్- అహ్మదాబాద్ సర్వీసులు మినహా) ప్రకటించింది.
విదేశీ రూట్లలో ఈ ఆఫర్ కింద వన్ వే చార్జీ రూ. 3,499లకే అందిస్తుంది. స్పైస్ జెట్ అందించిన ఈ టికెట్ల బుకింగ్ ఆఫర్ ఫిబ్రవరి 13వ అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ ఏడాది జూలై1 నుంచి అక్టోబర్ 24 మధ్య ప్రయాణించేవారు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్లో భాగంగా హైదరాబాద్- విజయవాడ, ఢిల్లీ- డెహ్రాడూన్, గౌహతి- కోల్కతా, అహ్మదాబాద్- ముంబై, బెంగళూర్- హైదరాబాద్ మధ్య రూ. 599లకే వన్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కోసం 4 లక్షల సీట్లను కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో లక్ష సీట్లు కేవలం రూ. 599లకే అందుబాటులో ఉంచారు.
ప్రయాణీకులకు రైలు చార్జీల కన్నా చౌకగా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించేందుకు ఈ ఆఫర్ ప్రకటించామని, ఈ ఆఫర్ కింద ఎసి రైలు చార్జీల కన్నా తక్కువ ధరకే విమానం ప్రయాణం చేయవచ్చని కంపెనీ సీసీఓ కనేశ్వరన్ అవిలి చెప్పారు. అన్సీజన్లో ఈ సీట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయని చెప్పారు. ఖాళీగా విమానాలు నడిపే బదులు ఈ ఆఫర్తో సీట్లను నింపితే వచ్చే ఆదాయాలతో లాభాలు వస్తాయని తెలిపారు.