శశికళ ఫ్యామిలీకి సినిమా కష్టాలు, త్వరలో ఫెరా కేసు తీర్పు, టీటీవీ దినకరన్ గుండెల్లో గుబులు !
శశికళ ఫ్యామిలీకి సినిమా కష్టాలు, ఇప్పటికే ఐదు మందికి జైలు శిక్షచివరి దశకు చేరుకున్న ఫెరా కేసు విచారణ, కోర్టులో ఈడీ అధికారుల సాక్షంటీటీవీ దినకరన్ గుండెల్లో గుబులు, మరో వైపు ఐటీ శాఖ అధికారుల విచారణ
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఇప్పుడు హడలిపోతున్నాడు. విదేశాల నుంచి అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించారని ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో టీటీవీ దినకరన్ విచారణ ఎదుర్కొంటున్నారు.
విదేశాల నుంచి అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా సాక్షాలు సేకరించి ఇప్పటికే కోర్టులో సమర్పించారు. ఫెరా కేసులోనే చిన్నమ్మ శశికళ పేరు కొట్టివేసిన ఈడీ అధికారులు మళ్లీ ఆమె పేరు తెర మీదకు తీసుకువచ్చారు.
దినకరన్ మీద నమోదు అయిన ఫెరా కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. టీటీవీ దినకరన్ నేరం చేసినట్లు రుజువు అయితే ఆయన కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సమాచారం. గురువారం టీటీవీ దినకరన్ సోదరి శ్రీతలదేవి, ఆమె భర్త ఆర్ బీఐ భాస్కరన్ కు మద్రాసు హై కోర్టు గతంలో సీబీఐ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది.
చిన్నమ్మ శశికళ, ఆమె వదిన ఇళవరసి, జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ లు ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్ప అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. గురువారం రోజు టీటీవీ బావ భాస్కరన్ కు ఐదేళ్లు, దినకరన్ సోదరి శ్రీతలదేవికి మూడేళ్ల జైలు శిక్ష ఖరారు అయ్యింది. శశికళ కుటుంబ సభ్యులు ఐటీ శాఖ అధికారుల విచారణ ఎదుర్కొంటున్నారు. మన్నార్ గుడి మాఫియాకు కష్టాలు మొత్తం ఒకే సారి వచ్చి మీదపడినట్లు అయ్యింది.