చెన్నై వరద బాధితులకు సెక్స్ వర్కర్ల ఆర్థిక సాయం
చెన్నై: మనుగడ సాగించేందుకు మనసు చంపుకుని పడుపు వృత్తిలో కొనసాగుతున్న సెక్స్ వర్కర్లు మానత్వాన్ని చాటుకున్నారు. దేశ వ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు, సంస్థలు చెన్నై వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వేళ.. సాయం చేసేందుకు మేము సైతం అంటూ వచ్చారు మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన సెక్స్ వర్కర్లు.
చెన్నై వరద బాధితులను ఆదుకోవడానికి తమవంతు సాయంగా రూ. లక్ష తమిళనాడు ప్రభుత్వానికి పంపారు. తమకు ఒక రోజులో పూట భోజనానికి అయ్యే ఖర్చును కూడా ఇందుకు జత చేశామని సెక్స్ వర్కర్లు తెలిపారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో స్నేహాలయ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అనిల్ కవాడేకు వాళ్లు అందించారు.
చెన్నై వరద పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి వీళ్లకు కంటి మీద కునుకులేదని, ఎలాగైనా బాధితులకు సాయం చేయాలని ఆలోచనతో ఈ సొమ్మును అందజేశారని స్నేహాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి చెప్పారు.
కాగా, జిల్లాలో మొత్తం సుమారు 3వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉండగా, వాళ్లలో 2వేల మంది ఈ విరాళాలు సేకరించి ఇచ్చారు.