అతి భారీ వర్షాలతో అతలాకుతలం- అర్ధరాత్రి డిప్యూటీ సీఎం పర్యటన: నేడు స్కూళ్లకు సెలవు
Chennai rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- దక్షిణ కోస్తా తీర ప్రాంతాల వైపు కదులుతుందని తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. అల్పపీడనం తీరానికి తీరం వైపు కదులుతున్న కొద్దీ వర్షాల తీవ్రత అధికమౌతూ వస్తోంది.

ఇదే తరహా పరిస్థితులు అటు తమిళనాడులోనూ నెలకొంది. ప్రత్యేకించి- ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలమౌతోన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం ఆయా జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న ఐటీ కంపెనీలు ఈ నెల 18వ తేదీ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని సూచించింది.

కొన్ని గంటల పాటు ఏకధాటిగా కురిసిన అతి భారీ వర్షానికి చెన్నై తీవ్రంగా ప్రభావితమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు నేలకూలాయి. కొమ్మలు విరిగి పడటం వల్ల అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
వర్షాల వల్ల కోడంబాక్కం, వడపళని, వళ్లువర్ కోట్టం, ఎగ్మూర్, అన్నా నగర్, తిరుమంగళం, ముకాప్పర్, కోయంబేడు, పెరంబూర్, వియాసర్బాడి, తాంబరం ప్రాంతాలు అతలాకుతలమైంది. చెన్నై దక్షిణప్రాంతంలోని ఎస్ కొళత్తూర్ వద్ద గల నారాయణపురం చెరువు పొంగిపొర్లుతోంది. ఇక్కడి నుంచి నీరు వెళ్లే అంబేద్కర్ కెనాల్ వరద తాకిడికి గురైంది.
#WATCH | Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin inspected the banks of the Narayanapuram Lake area between Pallikaranai and Kovilambakkam in Chennai, after heavy rainfall in area.
— ANI (@ANI) October 14, 2024
(Source: Udhayanidhi Stalin's Office) pic.twitter.com/MN69dNaiLc
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సుడిగాలి పర్యటన నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. నారాయణపురం చెరువు కట్టలను పరిశీలించారు. కట్ట తెగే ప్రమాదం ఉందని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు.
ఈదురుగాలుల వల్ల చెట్లు కూలిన మైలాయ్ ముసిరి సుబ్రహ్మణ్యం రోడ్, చెపాక్ ట్రిప్లికేన్ ప్రాంతాల్లో ఉదయనిధి స్టాలన్ పర్యటించారు. అక్కడ కొనసాగుతున్న చర్యలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల వారికి అవసరమైన ఆహారం, మంచినీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తాంబరం అధికారులు 044- 22200335 హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications