అమెరికా వాటర్ పార్కులో శవమై తేలిన ఇన్ఫోసిస్ ఉద్యోగి
చెన్నై: తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ 32ఏళ్ల ఇన్ఫోసిస్ ఉద్యోగి అమెరికాలోని వాషింగ్టన్ వాటర్ పార్కులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతుడిని విజయరేంగన్ శ్రీనివాసన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నీటిలో మునిగి ఊపిరాడకపోవడంతో అతడు మృతి చెందాడని పోలీసులు చెప్పారు. రెండు వారాల క్రితమే అమెరికాలోని బెల్లెవ్యూ ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఉద్యోగం రావడంతో శ్రీనివాసన్ అక్కడికి వెళ్లడం గమనార్హం.కాగా, అతనికి ఓ భార్య, మూడేళ్ల చిన్నారి ఉన్నారు.
సియాటెల్ టైమ్స్ కథనం ప్రకారం.. ఓ స్నేహితుడితో కలిసి శ్రీనివాసన్ సోమవారం ఉదయం 11గంటలకు వాటర్ పార్కుకు వచ్చాడు. పార్కు పక్కనే ఉన్న పెద్ద బండరాయిపై కాసేపు కూర్చున్నారు. 10 ఫీట్ల ఎత్తైన రాయి నుంచి శ్రీనివాసన్ మొదట దూకేశాడు. అయితే, శ్రీనివాసన్ బయటికి రాకపోవడంతో మరో స్నేహితుడు దూకకుండా అక్కడే ఆగిపోయాడు.
అరగంట పాటు అదే ప్రాంతంలో అతడు అటు ఇటు తిరిగాడు. కాగా, మునిగిపోతున్న శ్రీనివాసన్ను గమనించిన కొందరు చిన్నారులు కొందరు అక్కడి రక్షక దళాలను అప్రమత్తం చేశారు. అయితే రక్షక దళాలు వారి మాటలను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వచ్చి వాటర్ పార్కులో నుంచి శ్రీనివాసన్ మృతదేహాన్ని బయటికి తీశారు.
కాగా, శ్రీనివాసన్ లాంటి మంచి ఉద్యోగిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ఇన్ఫోసిస్ మంగళవారం పేర్కొంది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించింది. అతని కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.