చెన్నై రైల్వేస్టేషన్లో ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని దారుణ హత్య
చెన్నై: చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ఆగంతకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. హతురాలు చూలైమేడు ప్రాంతానికి చెందిన స్వాతి(25)గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న స్వాతి సూలైమేడు ప్రాంతంలోని దక్షిణ గంగై వీధిలో నివసించేది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 6.20 ప్రాంతంలో ఆమె తండ్రి నుంగంబాకమ్ స్టేషన్ వద్ద దించి వెళ్లాడు. దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు నుంగంబాకమ్ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది.
ఇంతలో నల్ల ప్యాంటు వేసుకున్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, ఓ కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. స్వాతి ముఖం మీద, మెడ మీద తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. అయితే ముందు ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుందని, ఆ తర్వాత అతడు బ్యాగ్లోంచి కత్తిని బయటకు తీసి దాంతో ఆమెను పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్వాతికి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గత వారం ఆమెకు ఓ క్యాబ్ డ్రైవర్ తో గొడవ అవ్వడంతో, అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ప్రేమ వ్యవహారమేమన్నా ఈ హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు స్వాతి తల్లిదండ్రులు, బంధువులను విచారిస్తున్నారు. స్వాతి తండ్రి కేంద్రప్రభుత్వ సంస్థలో పనిచేసి ఇటీవలే రిటైరయ్యారు. ఇదిలా ఉంటే స్వాతి మరణంపై ఇన్ఫోసిస్ స్పందించింది.
''చెన్నైలో మా ఉద్యోగిని దుర్మరణానికి కారణమైన ఈ దురదృష్టకర ఘటన పట్ల మేం చాలా విచారిస్తున్నాం. ఈ కేసును విచారిస్తున్న స్థానిక అధికారులకు మావైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ బాధామయ క్షణాలలో ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అన్నిరకాలుగా సాయం అందిస్తాం'' అన్నారు.