ఇసుక మాఫియా నరమేధం: బీజేపీ నేత సహా ముగ్గురు సజీవదహనం!
ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా వివాదం అత్యంత కిరాతక నరమేధానికి దారితీసింది. పాత కక్షల నేపథ్యంలో ఓ ఫార్చూనర్ కారును లారీలతో ముందు వెనుక బ్లాక్ చేసి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడిలో మాజీ జనపద్ పంచాయతీ అధ్యక్షుడు, బీజేపీ నేత భరత్ సింగ్(లల్లా సింగ్) సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. నౌగైన్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ రాక్షస కాండ కోరియా జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఇసుక క్వారీ కాంట్రాక్ట్ భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. అయితే సోన్హత్, కైలాష్పూర్ పరిసర ప్రాంతాలలో ఇసుక రవాణా, అక్రమ వసూళ్లపై భరత్ సింగ్ వర్గానికి మరో స్థానిక బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఇసుక రవాణా చేసే టిప్పర్ లారీల యజమానులైన త్రిపాఠి కుటుంబంతో చెల్లింపులు, స్థానిక ఆధిపత్యం విషయంలో వివాదం ముదిరింది. మంగళవారం రాత్రి ఈ వివాదంపై చర్చలు జరిపి సర్దుబాటు చేసుకునేందుకు భరత్ సింగ్ తన అనుచరులతో కలిసి వెళ్లగా.. అక్కడ ప్రత్యర్థులు ముందే సిద్ధం చేసిన ఉచ్చులో చిక్కుకున్నారు.

భరత్ సింగ్ ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు తమ లారీలను దానికి ముందు వెనుక అడ్డుగా పెట్టి తప్పించుకునే దారి లేకుండా చేశారు. ఆ వెంటనే కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారు లోపల మంటలు వేగంగా వ్యాపించడంతో భరత్ సింగ్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఆయనతో పాటు ఉన్న ఆయన సోదరుడు, ఉపాధ్యాయుడు అయిన నాగేంద్ర సింగ్, మరో వ్యక్తి వీరేంద్రసింగ్ చికిత్స పొందూతూ మరణించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మయాంక్ సింగ్ అనే యువకుడి పరిస్థితి ప్రస్తుతం బిలాస్పూర్లోని అపోల్ ఆస్పత్రిలో అత్యంత విషమంగా ఉంది.
CHHATTISGARH : रेत विवाद में जिंदा जला दिए 2 भाई!
— Khabar Chalisa (@KhabarChalisa) June 17, 2026
पूरी खबर पढ़े 👇👇👇https://t.co/17x8jLRZmk pic.twitter.com/9FwDWZ3eEG
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరిన భరత్ సింగ్ ఆ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ హత్యలపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి.. నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటివరకు అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి అనే నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications