ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు: చిదంబరంను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. విచారణ కోసం చిదంబరం బుధవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి పలు అంశాలపై సీబీఐ చిదంబరంను ప్రశ్నించింది.
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన అనుమతులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో చిదంరం కుమారుడు కార్తి చిదంబరం, ఐఎన్ఎక్స్ మీడియా మాజీ అధినేతలు పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
ఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ)కి అనుమతి ఇవ్వడంలో చిదంబరం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరాన్ని జులై 3 వరకు అరెస్ట్ చేయొద్దని దిల్లీ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఆయనను జులై 10 వరకు అరెస్ట్ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.