చిదంబరం పిటిషన్ సుప్రీంకోర్టులో జాబితాలోకి రాలేదు: 12 దేశాల్లో ఆస్తులు
న్యూఢిల్లీ: మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సీబీఐకి వ్యతిరేకంగా దాఖలు చేసిన కొత్త పిటిషన్ ఇప్పటికే వరకు జాబితాలోకి రాలేదని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. సీబీఐ కస్టడీని సవాలు చేస్తూ ఈ మాజీ కేంద్రమంత్రి సుప్రీంకోర్టులో కొత్తగా ఓ పిటిషన్ దాఖలు చేశారు.
చిదంబరం అరెస్ట్ తర్వాత కూడా అలాంటి ముందస్తు బెయిల్ పిటిషనే దాఖలు చేయడం గమనార్హం. అవసరమైన ఉత్తర్వులను వారాంతంలో భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి పొందలేమని జస్టిస్ భానుమతి తెలిపారు. అవసరమైన పని చేయాలని రిజిస్ట్రీని కోరినట్లు చెప్పారు.
ఒకవేళ చిదంబరం న్యాయ సహాయక బృందం కస్టడీ ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసులో ఈ సోమవారం వరకు చిదంబరంను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ సోమవారం విచారణకు తీసుకుంటామని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది.
12దేశాల్లో చిదంబరంకు ఆస్తులు
చిదంబరంకు 12 దేశాల్లో ఆస్తులున్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) సమర్పించిన వివరాల ప్రకారం.. అర్జెంటీనా, ఆస్ట్రియా, బ్రిటిష్ వర్జీనియా ఐస్లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, మలేషియా, మోనాకో, ఫిలిప్పీన్స్, సింగపూర్, సౌతాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక దేశాల్లో చిదంబరంకు ఆస్తులున్నాయని ఈడీ పేర్కొంది. ఈ ఆస్తులకు షెల్ కంపెనీల వ్యవహారాలకు సంబంధం ఉందని ఈడీ ఆరోపించింది. అందుకే చిదంబరాన్ని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.