షాకింగ్: 'అయ్యో ఇన్ని రోజులా..' జయలలిత ఫోటోకు శశికళ నో!
చెన్నై: జయలలిత మృతి అనంతరం తమిళనాట రాజకీయం వేడెక్కింది. అలాగే, జయ గురించి రోజుకో విషయం వెలుగు చూస్తోంది. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన ఫోటోను ప్రజలకు విడుదల చేయాలని అడిగారని అంటున్నారు.
అయితే, ఆమె నెచ్చెలి శశికళ మాత్రం దానిని అడ్డుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జయలలిత ఆసుపత్రిలో 74 రోజుల పాటు చికిత్స పొంది, అనంతరం కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఫోటో విడుదల చేయమన్న జయ
ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజులకు జయ స్పృహలోకి వచ్చారని, ఆ సమయంలో తాను ఆసుపత్రికి వచ్చి ఎన్నిరోజులు అయిందని అక్కడి వారిని అడిగారని తెలుస్తోంది. దానికి వారు సమాధానం చెప్పారు. ఆ సమాధానం విన్న జయలలిత.. ఇన్ని రోజులు అయిందా అని అంటూ.. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారోనని, తన ఫోటోతో ప్రకటన విడుదల చేయాలని సూచించారని అంటున్నారు.
అడ్డుకున్న శశికళ
ఇదే విషయాన్ని వైద్యులు జయలలిత నెచ్చెలి శశికళకు చెప్పారని తెలుస్తోంది. అయితే, వైద్యులు అలా విడుదల చేయకుండా శశికళ అడ్డుకున్నారనే ప్రచారం సాగుతోంది.
ఆసుపత్రిలోనే చక్రం..
అంతేకాదు, జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడే.. పార్టీలో శశికళ చక్రం తిప్పారనే వాదనలు కూడా వినిపించాయి. చాలామంది తమ ఫిర్యాదుల కోసం శశికళ వద్దకు వెళ్లారని చెబుతున్నారు. తద్వారా పార్టీ పైన పట్టుకోసం ఆమె మొదటి నుంచే పావులు కదుపుతోందని అంటున్నారు.
పోయెస్ గార్డెన్ నుంచి
జయలలిత మృతి అనంతరం శశికళ పార్టీ పగ్గాలు, ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాల కోసం పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి, ఆ తర్వాత సీఎం పదవిలో కూర్చోవాలని భావిస్తున్నారట. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా, చాలామంది పార్టీ నేతలు ఆమెతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆమెకు వంద మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది.