తూర్పు లడఖ్ సమీపంలో కొత్త రహదారులను నిర్మిస్తున్న చైనా; క్షిపణి రెజిమెంట్ల మోహరింపు!!
డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే లా వ్యవహరిస్తోంది. దాదాపు సంవత్సర కాలంగా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం తూర్పు లడక్ సమీపంలో తన కార్యకలాపాలను చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం భారత్ కు ఆందోళన కలిగిస్తుంది.సరిహద్దు వెంబడి భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన మధ్య, చైనా కొత్త రహదారులను నిర్మించడం ప్రారంభించింది. తూర్పు లడఖ్ సమీపంలో చైనా క్షిపణి మరియు రాకెట్ రెజిమెంట్లను మోహరించడం ప్రారంభించింది. భారత్ భూభాగంలో చైనా కవ్వింపు చర్యలు, చైనా వేస్తున్న అడుగులు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనకు కారణంగా మారాయి.

అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా సైన్యం కొత్త రహదారుల నిర్మాణం
తూర్పు లడఖ్ సెక్టార్ ఎదురుగా ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా సైన్యం కొత్త రహదారులను నిర్మించడం ప్రారంభించింది. ఇంతకు ముందు తూర్పు లడఖ్ సమీపంలో భారత భూభాగంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది . ఇప్పుడు మళ్లీ చైనా కొత్త రహదారులను నిర్మించి భారత్ కు కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. ఈ రహదారుల వల్ల వారి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. చైనా సైన్యం వాస్తవ నియంత్రణ రేఖను చేరుకోవడానికి ప్రతిస్పందన సమయం గతంలో కంటే చాలా తక్కువ అవుతుందని ఉన్నతాధికారవర్గాలు చెబుతున్నాయి.

టిబెట్ అటానమస్ రీజియన్లో చైనా క్షిపణి మరియు రాకెట్ రెజిమెంట్లు
చైనా సైన్యానికి చెందిన క్షిపణి మరియు రాకెట్ రెజిమెంట్లు టిబెట్ అటానమస్ రీజియన్లోని ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో మోహరించబడ్డాయి . అక్కడ వారు షెల్టర్లను నిర్మించినట్లు వర్గాలు తెలిపాయి. అంతేకాదు చైనా నిఘా కోసం డ్రోన్ల విస్తరణ కూడా పెరిగిందని భారత్ గుర్తించింది. మూలాల ప్రకారం, కష్గర్, గర్ గున్సా మరియు హోటాన్లోని ప్రధాన స్థావరాలను కాకుండా, హైవేలను వెడల్పు చేయడం మరియు కొత్త ఎయిర్ స్ట్రిప్లను నిర్మిస్తున్న చైనా సైనిక మౌలిక సదుపాయాల నవీకరణపై దృష్టి సారించినట్టు సమాచారం.

గత శీతాకాలంతో పోలిస్తే మరింత మెరుగైన సన్నాహాలు చేసిన చైనా
చైనా సైన్యం టిబెటన్లను రిక్రూట్ చేయడానికి, ప్రధాన భూభాగమైన హాన్ దళాలతో పాటు సరిహద్దు పోస్ట్లలో వారిని ఆధారంగా చేసుకునే ప్రయత్నం కూడా వేగం పుంజుకుంటోందని వర్గాలు తెలిపాయి. మనుగడ కష్టతరమైన క్లిష్ట భూభాగాన్ని నిర్వహించడానికి చైనా టిబెటన్ లను ఉపయోగించాలనుకుంటోందని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది . గత శీతాకాలంతో పోల్చినప్పుడు, మూలాల ప్రకారం, ఆశ్రయం, రహదారి అనుసంధానం మరియు అలవాటు పరంగా చైనీయులు ఈ సంవత్సరం మరింత మెరుగ్గా సన్నాహాల్లో ఉన్నారని సమాచారం.

చైనా అడుగులపై భారత్ నిఘా.. అమెరికా ఆయుధాలతో ఇప్పటికే రెడీగా భారత్
ఇటీవల భారత్-చైనాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా సరిహద్దు వద్ద చైనా సైనిక బలగాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్న భారత్ కూడా ఈశాన్య ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇటీవల భారత్ ఈ ప్రాంతంలో అమెరికా తయారుచేసిన చినూక్ హెలికాప్టర్లను, అల్ట్రా లైట్ టోవ్డ్ హోవిట్జర్ లను, స్వదేశీయంగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిలను, రైఫిల్స్ ను, అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.












Click it and Unblock the Notifications