నిర్మలా సీతారామన్ కు చైనా మీడియా ప్రశంస
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. సిక్కింలోని నాథూ లా సరిహద్దు వద్ద ఆమె భారత సరిహద్దుకు అవతల ఉన్న చైనా సైనికులతో సంభాషించడాన్ని చైనా.
ఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. సిక్కింలోని నాథూ లా సరిహద్దు వద్ద ఆమె భారత సరిహద్దుకు అవతల ఉన్న చైనా సైనికులతో సంభాషించడాన్ని చైనా ప్రసార మాధ్యమాలు స్వాగతించాయి.
చైనా ప్రభుత్వ సారథ్యంలోని సీజీటీఎన్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భారత రక్షణమంత్రి చొరవతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడే అవకాశముందని, అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగేందుకు దోహద పడుతుందని గ్లోబల్టైమ్స్ పేర్కొంది.
కొద్ది రోజుల కిందట నాథూ లా సమీపంలోని డోక్లాంలో చైనా సైన్యం నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులను భారత సైన్యం అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో చైనా భారీగా సైన్యాన్ని మోహరించడంతో భారత్ కూడా భారీ ఎత్తున సైనికదళాలను రంగంలోకి దింపింది.
దాదాపు 70 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రతిష్టంభన చివరికి చర్చలతో తొలగిపోయింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.
ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రక్షణమంత్రి సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. సరిహద్దు అవతల ఉన్న చైనా సైనికులతో ఆమె ఆంగ్లంలో మాట్లాడటం, నమస్తేను చైనా భాషలో ఎలా పలకాలో తెలుసుకోవడం తెలిసిందే.