ఇండియాకు డ్రాగన్ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణం
న్యూఢిల్లీ: చైనా ఇండియాకు వ్యతిరేకంగా గోతులు తీస్తూనే ఉంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తన పథకాన్ని అమలు చేసేందుకు చైనా ప్రయత్నాలను చేస్తోంది. ఇండియాతో సత్సంబంధాలను కోరుకొంటున్నట్టు పైకి ప్రకటిస్తూనే ఇండియాకు నష్టం కల్గించే చర్యలకు దిగుతోంది. తాజాగా సియాచిన్ సమీపంలో 36 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తోంది.
కొంతకాలంగా చైనా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.. డోక్లామ్ వివాదం నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ వివాదాన్ని రెండు దేశాలు పరిష్కరించుకొన్నాయి. అయితే ఆ తర్వాత కూడ పలు రకాలుగా ఇండియాపై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం విషయంలో భారత్ తన వ్యతిరేకతను వ్యక్తం చేసినప్పటికీ కూడ చైనా లెక్క చేయలేదు. ఈ కారిడార్ విషయంలో పాక్ సూచనలను పరిగణనలోకి తీసుకోవడం పట్ల భారత్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.
సియాచిన్లో చైనా రహదారి నిర్మాణం
భారత్కు అత్యంత కీలకమైన యుద్ధక్షేత్రం సియాచిన్ సమీపంలో 36కిలోమీటర్ల రహదారిని చైనా నిర్మిస్తోంది. సియాచిన్ హిమనీనదానికి ఉత్తరాన ఉన్న షక్గమ్ లోయలో 36 కిలోమీటర్ల రహదారిని చైనా నిర్మిస్తోంది.దీంతో భారత్-చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను సులభంగా చేరుకునే అవకాశం చైనాకు దక్కుతోంది.
భారత్ ,పాక్ మధ్య వివాదాస్పద ప్రాంతం
షక్గమ్ లోయను 1963లో పాకిస్థాన్ చైనాకు ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు.దీంతో ఈ ప్రాంతంపై భారత్ పాక్ మధ్య కొంత వివాదం కొనసాగుతోంది. అయితే ఇది వివాదాస్పద ప్రాంతం కావడంతో చైనా ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది.ఇదే ప్రాంతంలో రెండు మిలటరీ పోస్టులను కూడ ఏర్పాటు చేశారు.
సియాచిన్ భారత్ రక్షణకు కీలకం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే యుద్ధక్షేత్రం సియాచిన్. ఆ కొంత భూభాగం మినహా మిగతా మొత్తం భారత్ అధీనంలోనే ఉంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం కావడంతో భారత్ నిత్యం సియాచిన్ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.అయితే ఇలాంటి ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం చేయడం ఇండియాకు ఇబ్బందికరంగా పరిణమించనుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడ ఇదే తరహలో చైనా నిర్మాణాలు
గతంలో కూడ చైనా ఇదే తరహలో రోడ్డు నిర్మాణాలకు పూనుకొంది. భారత్-భూటాన్-చైనా ట్రైజంక్క్షన్ అయిన డోక్లాంలో చైనా చేపట్టిన రహదారి నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. అరుణాచల్ప్రదేశ్లోని బిషింగ్ గ్రామానికి సమీపంలో గల సరిహద్దులో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. ఇండియా అడ్డుకోవడంతో చైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకొంది. అయితే తాజాగా సియాచిన్ సమీపంలో రోడ్డు నిర్మాణానికి పూనుకోవడం భారత్ ను ఇబ్బందులకు గురి చేస్తోంది.