ఖాళీ చేయించమంటారా?: ఎక్కడుండాలని చిరంజీవి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంటికి నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసు అంటించిన విషయం తెలిసిందే. మీరు ఇల్లు ఖాళీ చేస్తారా లేక చేయించమంటారా? కేంద్రం నోటీసులు ఇచ్చింది. గురువారంతో గడువు తీరిందని, ఇంటికి తాళం వేస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. దీని పైన చిరంజీవి పలు పత్రికలతో స్పందించారు.
తనకు ప్రత్యామ్నాయ నివాసం చూపించకుండా తక్షణమే ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రిగా తన పదవీ కాలం ముగిసిన వెంటనే తనకు కొత్త నివాసం కేటాయించాలని కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాశానని, అప్పుడు స్పందించకుండా ఖాళీ చేయమనడం సరికాదని, తాను ఎక్కడ ఉండాలో చెప్పాలన్నారు.
నివాసయోగ్యమైన ఇల్లు చూపిస్తే తక్షణమే మంత్రిగా తనకు ఇచ్చిన బంగళాను ఖాళీ చేస్తానని తెలిపారు. ఈ విషయమై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా కిందిస్థాయి ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం చిరంజీవికి తుగ్లక్ రోడ్డులోని ఓ ఇల్లు చూపారు. అయితే అందులో మరమ్మతులు చేయించాల్సి ఉంది.
లూట్యెన్స్ ఢిల్లీలోని విశాలమైన బంగళాల్లో గడువు తీరిన తర్వాత కూడా అనధికారికంగా నివాసం ఉంటున్న ఎంపీలు, మాజీ మంత్రులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. చిరంజీవి గురువారం వరకూ ఖాళీ చేయకపోవడంతో శుక్రవారం ఆయన నివసిస్తున్న ప్రభుత్వ బంగళాకు తాళం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.
స్థానిక 17, అక్బర్ రోడ్లోని టైప్-8 బంగ్లాను ఖాళీ చేయాలని కేటాయింపు రద్దు అయిన తరువాత ఆయనకు ఎస్టేట్ ఆఫీసర్ నోటీసులు పంపించారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఈ భవనాన్ని కేటాయించారు. దీంతో ఆయన తనకు కేటాయించిన 17, అక్బర్ రోడ్కు మారాలని నిర్ణయించుకున్నారు.
యుపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉండగా, చిరంజీవి ఈ బంగ్లాను ఎంచుకున్నారు. ఇది దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో, ఐదుకు పైగా సిబ్బంది క్వార్టర్లు కలిగి ఉంటుంది. మంత్రులుగా గతంలో పని చేసి ప్రస్తుతం లోకసభ సభ్యులుగా ఉన్న వారికి బంగళాల కేటాయింపులో రాయితీ ఉంటుంది. రాజ్యసభ సభ్యులకు మాత్రం ఈ అవకాశం లేదు.
దీంతో తమకు కూడా టైప్ 8, టైప్ 7 బంగ్లాల కేటాయింపులో రాయితీ ఇవ్వాలంటూ చిరంజీవితో పాటు మాజీ కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, వయలార్ రవి, జైరాం రమేశ్ తదితరులు రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ భుబనేశ్వర్ కళిత (కాంగ్రెస్)కు జూలై నెలలో విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అక్టోబర్లో తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా 315 మంది లోకసభ సభ్యులు ఎన్నికై రావడంతో మాజీలు బంగళాలు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కొన్ని నెలలుగా కోరుతోంది.
తాను నివసిస్తున్న టైప్-8 బంగళాను ఖాళీ చేయాలంటూ చిరంజీవికి ఎస్టేట్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అక్టోబర్ 30వ తేదీన చివరి నోటీసును బంగ్లా గేటుకు అంటించారు. తక్షణం ఖాళీ చేయకుంటే బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయినా చిరంజీవి బంగ్లాను ఖాళీ చేయలేదు.
తమ ప్రమేయం లేకుండా బంగళా ఖాళీ చేస్తారని రెండు వారాల పాటు ఎదురు చూశామని, అయినా ఖాళీ చేయకపోవటంతో శుక్రవారం బంగళాకు తాళాలు వేస్తామని అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలతో ఢిల్లీలో ఇప్పుడు మాజీ మంత్రులు, ఎంపీలు నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయించడమూ సమస్య అయింది. కాగా, చిరంజీవితో పాటు రాజీవ్ శుక్లా తదితరులకు నోటీసులు ఇచ్చారు.