భారత కరోనా వ్యాక్సిన్ అందింది: ప్రధాని మోడీ, భారత ప్రజలకు థ్యాంక్ అంటూ క్రిస్ గేల్(వీడియో)
కింగ్స్టన్/న్యూఢిల్లీ: తమ దేశం జమైకాకు కరోనా వ్యాక్సిన్ అందించినందుకు వెస్టిండీస్ క్రికెటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రభుత్వం, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. ఆ వీడియోను జమైకాలోని భారత హై కమిషన్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
వ్యాక్సిన్ మైత్రి పేరిట ప్రపంచ దేశాలకు భారత వ్యాక్సిన్..
భారత హై కమిషనర్ ఆర్ మసాకుయ్ను కలిసిన గేల్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఫొటోలను షేర్ చేశారు. కాగా, పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు కూడా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తాను భారత్కు వస్తానని, కలుస్తానని చెప్పారు. మార్చి 11న కరీబీయయన్ ప్రాంతాని(ఆంటిగ్వా, బార్బుడా, జమైకా)కి 20వేల కరోనా వ్యాక్సిన్ డోసులను భారత్ పంపింది. వ్యాక్సిన్ మైత్రి పేరిట కరోనా మహమ్మారి బారినపడి బాధపడుతున్న పలు దేశాలకు భారత్ వ్యాక్సిన్లను అందజేస్తోంది.
భారత్ ధన్యవాదాలంటూ విండీస్ క్రికెటర్లు
ఇంతకుముందు వెస్టిండీస్ క్రికెటర్లు సర్ వివియన్ రిచర్డ్స్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంటిగ్వా, బర్బూడాల తరపున తాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను ఎంతో ఉదారంగా అందజేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించినందుకు ఆంటిగ్వా క్రికెటర్ జిమ్మీ ఆడమ్స్ భారత్కు రుణపడి ఉంటామని తెలిపారు.
150కిపైగా దేశాలకు భారత వ్యాక్సిన్లు
మరో క్రికెటర్ ఆండ్రూ రస్సెల్ కూడా ప్రధాని మోడీకి బుధవారం ధన్యవాదాలు తెలిపారు. 'ప్రధాని మోడీ, భారత హై కమిషన్కు చాలా ధన్యవాదాలు. మాకు వ్యాక్సిన్లు అందాయి. భారత దాతృత్వాన్ని జమైకా ప్రజలు అభినందిస్తున్నారు. ప్రపంచం సాధారణ స్థితికి వస్తే చూడాలని ఆతృతతో ఉన్నా' అని రస్సెల్ ఓ వీడియోలో పేర్కొన్నారు. కాగా, భారత్ ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ప్రపంచంలోని సుమారు 150 దేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు ప్రధాని మోడీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నారు.