మోదీ మెడలు ఇంకా వంచుదాం -ఫ్రీ వ్యాక్సిన్ -ఇక మారటోరియంపై పోరాడుదాం: 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖలు
సుప్రీంకోర్టు మొట్టికాయలు, రాష్ట్రాల వినతులు, ప్రతిపక్షాల విమర్శలు, సామాన్యుల ఛీత్కారాలు.. కారణం ఏదైనప్పటికీ జాతీయ టీకా విధానాన్ని మోదీ సర్కారు మార్చుకోవడం, జూన్ 21 నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రమే టీకాలను అందజేస్తుందని, రాష్ట్రాలకు పైసా భారం ఉండబోదని, దేశంలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో 75శాతం టీకాలను కేంద్రమే సేకరిస్తుందని, మిగతా 25 శాతం డోసుల్ని ప్రైవేటుకు కేటాయిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తమ ఘనతేనంటూ ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో అడుగు ముందుకేసి రాష్ట్రాలకు తదుపరి లక్ష్యాన్ని సూచించారు..
CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్
మారటోరియంపై పోరు..
కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకోవడం, ఉచిత టీకాల కోసం రాష్ట్రాలు చేసిన డిమాండ్ నెరవేరడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్తగా మరో అంశాన్ని లేవనెత్తారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమల రుణాలపై మారటోరియం ప్రకటించాలనే తన డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ 12 రాష్ట్రాలకు లేఖ రాశారు.
రాష్ట్రాలు ఐక్యంగా ఉంటేనే..
''మనం ఐక్యంగా కృషి చేయడం వల్లే కేంద్రం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుంది. అలాగే ఎంఎస్ఎంఈ పరిశ్రమల రుణాలపై మారటోరియం ఇవ్వాలని కోరుదాం. కరోనా మొదటి వేవ్ సమయంలో రుణగ్రహీతల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరులో, ప్రస్తుత రెండో వేవ్లో రుణగ్రహీతల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరులో అసమానతలున్నాయి. రెండో వేవ్ లాక్డౌన్లో కేంద్రం ఆర్థిక ఉద్దీపన పథకాలేవి ప్రకటించలేదు. అందుకే రూ. 5కోట్ల వరకు రుణాలున్న పరిశ్రమలకు ఊరట కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రులంతా కేంద్ర ఆర్థిక మంత్రికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కు లేఖలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నా''అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.
జగన్, కేసీఆర్ సహా 12 మంది సీఎంలకు
దేశ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఎమ్ఎస్ఎమ్ఈలే ప్రధాన ఆధారమన్న స్టాలిన్.. వాటికి మారటోరియం ప్రకటించేలా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుదామంటూ లేఖలు రాసిన వారంతా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమత, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమత్ సోరెన్ తోపాటు ఎన్డీఏ మిత్రుడైన బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కూడా స్టాలిన్ లేఖలు రాశారు.