వైద్య విద్యాసంస్థలకు వ్యాపించిన నిరసన సెగ: ఉద్యమించిన జూనియర్ డాక్టర్లు..!
న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు మాత్రమే పరిమితమైన పౌరసత్వ సవరణ చట్టం నిరసన ప్రదర్శనల సెగ.. ఇక వైద్య విద్యాసంస్థలకు కూడా పాకింది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఉద్యమిస్తున్నారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), సహా దాని అనుబంధ వైద్య విద్యాసంస్థల విద్యార్థులు రోడ్డెక్కారు. భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.
జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలను ఢిల్లీ పోలీసుల తీరును కూడా జూనియర్ డాక్టర్లు తప్పు పట్టారు. విశ్యవిద్యాలయం క్యాంపస్ లోకి బయటి వారికి ప్రవేశం ఉండబోదని, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులు ఏ ఉద్దేశంతో ఆవరణలోకి వచ్చారని వారు నిలదీశారు. హాస్టళ్లలో చొరవడి విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయడం, నేరస్తుల్లాగా వారిని రాత్రంతా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అమానవీయమని విమర్శించారు.
జామియా యూనివర్శిటీ విద్యార్థులకు మద్దతుగా వారు దేశ రాజధానిలో భారీ ర్యాలీని నిర్వహించారు. వందమందికి పైగా జూనియర్ డాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టిన ఎయిమ్స్ జూనియర్ డాక్టర్లు.. తమ నిరసన ప్రదర్శనలను కొనసాగించారు. ఎయిమ్స్ ప్రధాన ద్వారం వద్ద బైఠయించి, నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులపై క్రిమినల్ కేసు పెట్టాలని జూనియర్ డాక్టర్లు నినదించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాదిమంది విద్యార్థులు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వారు నో క్యాబ్, నో ఎన్ఆర్సీ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
దేశ ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని జూనియర్ డాక్లర్లు ఆరోపించారు. ఈ చట్టాన్ని అమలు చేయడాన్ని మెజారిటీ ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. ప్రజా వ్యతిరేకంగా ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. దేశాన్ని మతపరంగా విభజించి, పాలించాలనే సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని జూనయిర్ డాక్టర్లు మండిపడ్డారు.