బరిలో దిగిన కాంగ్రెస్: ప్రియాంకా గాంధీ మౌనపోరాటం: ఇండియా గేట్ వద్ద.. !
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొద్దిరోజులుగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇన్ని రోజులూ ప్రకటనలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. బరిలోకి దిగింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బైఠాయించారు. మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
ఢిల్లీ పోలీసుల మెడకు: జామియా వర్శిటీ విద్యార్థినులను లైంగికంగా: ప్రైవసీకి దెబ్బ: వైస్ ఛాన్సలర్ ఫైర్.
సీనియర్లతో కలిసి..
సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైఠాయించారు. పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్, పీఎల్ పునియా.. ప్రియాంకా గాంధీతో కలిసి ఈ మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. వందలాదిమంది కార్యకర్తలు ఒకేసారి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జామియా విద్యార్థులపై లాఠీఛార్జీ అనంతరం..
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు న్యూఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో పోలీసులు ప్రవేశించడం, విద్యార్థుల హాస్టళ్లలో చొరబడి వారిని నిర్బంధంలోకి తీసుకోవడం వంటి చర్యలతో ఉద్యమం మరిం తీవ్రరూపం దాల్చినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిల్చోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు.
Smt. @priyankagandhi & senior leaders of the Congress party are present at India Gate right now to protest the unconstitutional Citizenship Amendment Act & violence against students. We urge all citizens to join the peaceful demonstration. #BJPBurningBharat pic.twitter.com/OPYA8K8JQ6
— Congress (@INCIndia) December 16, 2019